ఖానాపురం, డిసెంబర్ 11: మండలంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో ధాన్యం ఆరబోసుకున్న రైతులు అయోమయానికి గురయ్యారు. వర్షం కురిసే అవకాశం ఉండడంతో కొనుగోలు కేంద్రాలు, జాతీయ రహదారి వెంట ధాన్యం ఆరబోసుకున్న అన్నదాతలు ధాన్యం తడువకుండా పరదాలు కప్పుకునే పనిలో నిమగ్నమయ్యారు. మూడు రోజులుగా వాతావరణం మారుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్లకు ఉష్ణోగ్రత తగులకపోవడంతో తేమశాతం తగ్గడం లేదని, తద్వారా ధాన్యాన్ని కాంటా పెట్టలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఎంపీవో
నల్లబెల్లి: జాతీయ రహదారి వెంట ధాన్యం ఆరబోసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీవో కూచన ప్రకాశ్ సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ 365 జాతీయ రహదారికి ఇరువైపులా మిషన్ భగీరథ పైపులైన్ ఉందని తెలిపారు. నీటి ఒత్తిడి కారణంగా అప్పుడప్పుడు పైపులైన్కు లీకేజీలు ఏర్పడుతుంటాయని చెప్పారు. ఈ క్రమంలో హైవేపై ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి ఘటనలు జరిగితే ఏ ప్రభుత్వం కూడా రైతులకు నష్టపరిహారం చెల్లించదని సూచించారు. ఈ విషయాన్ని గమనించి ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతులు జాతీయ రహదారిపై కాకుండా తమ పంట పొలాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు. అలాగే, తుఫాన్ ప్రభావంతో వర్షం పడే అవకాశం ఉన్నందున మండలంలోని రైతులు ధాన్యం తడువకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.