ఖిలావరంగల్, డిసెంబర్ 11: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని క్రీడాకారులకు అనుగుణంగా మైదానాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్రీడాకారులకు హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం ఆయన ఖిలావరంగల్ మైదానంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్తో ముచ్చటించారు. అలాగే, గ్రౌండ్లో క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. షాట్ఫుట్ విసిరారు. అనంతరం మైదానంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులను కలిశారు. వారికి వ్యాయామ సామగ్రిని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులు దాతల సహకారాన్ని వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని సూచించారు. సమయాన్ని వృథా చేయకుండా క్రమం తప్పకుండా సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయి ఉమా దామోదర్యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు కాసుల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు..
గిర్మాజీపేట: శ్రీరామలింగేశ్వరస్వామి పాలకమండలి సభ్యులకు రెండోసారి అవకాశం కల్పించినందుకు శివనగర్లోని ఎమ్మెల్మే కార్యాలయంలో వారు నన్నపునేని నరేందర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ చైర్మన్ అప్పరాజు రాజు, పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానించి స్వీట్లు తినిపించారు. అనంతరం 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పనా నవీన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సన్మానించి స్వీట్లు అందించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు చిట్టిమళ్ల సురేశ్, పప్పుల మంజుల, గంగిశెట్టి హరినాథ్, బిట్ల శేఖర్, కటకం రాములు పాల్గొన్నారు.
నన్నపునేనికి ఖురాన్ అందజేత
పోచమ్మమైదాన్: పోచమ్మమైదాన్ వద్ద ఏర్పాటు చేసిన మసీద్ దర్శన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కమిటీ నిర్వాహకులు దివ్య గ్రంథమైన ఖురాన్ను అందజేశారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.