ఖిలావరంగల్, డిసెంబర్ 11: ఓ కుటుంబం దైవదర్శనం కోసం తిరుపతికి వెళ్లి సంతోషంగా దేవుడిని దర్శించుకుంది. అనంతరం తిరుగు ప్రయాణంలో రైలులో వస్తుండగా స్టేషన్లో ప్రమాదవశాత్తు కిందపడి కళ్లెదుటే తల్లి మృతి చెందింది. దీంతో కూతురు రోదనలను చూసిన తోటి ప్రయాణికులు చలించిపోయారు. ఈ హృదయవిదారక ఘటన ఆదివారం వరంగల్ రైల్వేస్టేషన్లో జరిగింది. వరంగల్ రైల్వే పోలీసులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన గడ్డం తిరుపతమ్మ(42) తన భర్త నరహరి, కూతురు తిరుమలతో కలిసి హనుమకొండ బాలసముద్రంలో నివాసముంటున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులందరూ తిరుపతికి వెళ్లి వేకంటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ రైలులో ఎక్కారు. ఈ క్రమంలో రైలు వరంగల్ సేష్టన్కు చేరుకోగా, రైలు నుంచి దిగుతున్న క్రమంలో తిరుపతమ్మ ప్రమాదవశాత్తు ప్లాట్ఫాం మధ్యలో పడిపోయింది. రైలు ముందుకు కదలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లెదుటే తన తల్లి మృతి చెందడంతో తిరుమల రోదనలు ప్రయాణికులను కంట తడిపెట్టించాయి. వరంగల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చూరికి తరలించారు.