కమలాపూర్, డిసెంబర్ 10 : డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల కల సాకారమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పేదలకు ఇచ్చిన మాట తప్పకుండా పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తుండడంతో వారిలో సంతోషం వెల్లివిరుస్తోంది. కమలాపూర్ మండలంలోని కమలాపూర్, గూడూరు, మర్రిపెల్లిగూడెం గ్రామాల్లో 2018లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కమలాపూర్లో 320, గూడూరులో 50, మర్రిపల్లిగూడెంలో 50 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సుమారు రూ.25కోట్లకు పైగా వెచ్చించారు. మరో రూ.5కోట్లతో అంతర్గత రహదారుల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం, కరంటు సరఫరా, తాగునీటి సరఫరా పనులు చేస్తున్నారు. నూతన సంవత్సర వేళ డబుల్ బెడ్ రూమ్లను లబ్ధిదారులకు అందించి పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేయించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమాయత్తం అవుతున్నారు.
ఈటల నిర్లక్ష్యంతో ఆలస్యం..
కమలాపూర్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిర్లక్ష్యం చేయడం వల్ల ఏళ్ల తరబడి మండలంలో డబుల్ ఇండ్ల నిర్మాణం నిలిచిపోయింది. కమలాపూర్లో 50 డబుల్ బెడ్ రూం ఇండ్లను తొలిసారి ప్రారంభించిన కాంట్రాక్టర్ పూర్తి చేయకుండానే వదిలేసి వెళ్లిపోయారు. ఏడాది క్రితం హుజూరాబాద్ ఉప ఎన్నిక రావడంతో ఎన్నికలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ మంత్రులు హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలైనా ఇచ్చిన మాట తప్పకుండా డబుల్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించాలనే లక్ష్యంతో పనులు వేగంగా చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లకు పెయింటింగ్ వేశారు. నెల రోజుల్లో అంతర్గత పనులు పూర్తి చేసి పేదలకు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చొరవతో ఇండ్లు పూర్తికావడంతో ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.