నల్లబెల్లి, సెప్టెంబర్ 17: నల్లబెల్లి క్రాస్రోడ్డులోని 365 జాతీయ రహదారి నుంచి గిర్నిబావి వరకు 24 ఫీట్లతో రెండు లేన్ల తారు రోడ్డు నిర్మాణానికి రూ. 15 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ నల్లబెల్లి నుంచి దుగ్గొండి మీదుగా గిర్నిబావి వరకు రోడ్డు నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజల చిరకాల స్వప్నం అతిత్వరలో నెరవేరనుందన్నారు. పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఇందులో నల్లబెల్లి, దుగ్గొండి మండలకేంద్రాల్లో డివైడింగ్, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో సైతం రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలో వందశాతం సీసీ, తారు రోడ్ల నిర్మాణం పూర్తి చేయిస్తానని స్పష్టం చేశారు.