వర్ధన్నపేట, ఆగస్టు 15 : నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. మండలంలోని బండౌతాపురం, అంబేద్కర్ నగర్ గ్రామాలకు చెందిన 40 మందికి కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను కొనసాగించారన్నారు. ప్రధానంగా పేద కుటుంబాలకు కొత్తగా పింఛన్లు మంజూరు చేశారన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ దశల వారీగా పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే, వర్ధన్నపేట బృందావన మండల సమాఖ్య కొనుగోలు చేసిన ట్రాక్టర్ను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమాఖ్యకు అందజేశారు.
మండల సమాఖ్య ఆర్థికంగా మరింత ప్రగతి సాధించాలన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా తదితరులు పాల్గొన్నారు.
కరీమాబాద్ : గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్లో నిర్వహించిన పలు వేడుకల్లో ఎమెఎ్మల్యే అరూరి రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంగోపాలపురంలోని పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దోమ రమేశ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.