జనగామ, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ కార్యకర్తలు, సమాన్యులపై దాడి చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలేదని లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న వేళ పాదయాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 500మంది గూండాలతో సామాన్యులపై దాడులకు తెగబడి హింసాత్మక ఘటనలకు పాల్పడడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
దేవరుప్పులలో బీజేపీ నాయకుల దాడిలో గాయపడి పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి మంత్రి దయాకర్రావు సోమవారం పరామర్శించారు. ‘టీఆర్ఎస్ కార్యకర్తలే కాదు..సామాన్యులపైనా బీజేపీ మూక కర్రలు, రాడ్లతో దాడికి తెగబడింది. బండి సంజయ్ వందలాది మంది గూండాలతో పాదయాత్ర చేస్తూ ప్రశ్నించివారిపై దాడులు చేయిస్తున్నాడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరుప్పుల ఘటనతో బీజేపీ వైఖరి, అసలు రంగు మరోసారి బయటపడిందని దుయ్యబట్టారు.
స్వాతంత్య్ర వేడుకల కోసం ప్రజలంతా రోడ్లపైకి వచ్చారని, ఇదే సమయంలో బండి సంజయ్ యాత్ర పేరుతో దేవరుప్పుల చౌరస్తాకు 500 మంది గూండాలతో వచ్చారని, సీఎం కేసీఆర్ కుటుంబంపై, మంత్రినైన తనపై ఇష్టానుసారంగా మాట్లాడడమే సమస్యకు దారితీసిందని వివరించారు. ఒకరిద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలు బండిని అలా మాట్లాడవద్దని సూచించడంతో బీజేపీ గూండాలు టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలపై కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడులు చేశారని చెప్పారు.
సామాన్య పౌరురాలు సత్తెమ్మపైనా రాళ్లు రువ్వారని, దొరికినవాళ్లను వదలకుండా విచక్షణారహితంగా కొట్టారని, కోతి ప్రవీణ్ చేయి విరిగిందని, దివ్యాంగుడైన శ్రీకాంత్ కాలు విరిగిందని, వడ్లకొండ శ్రీకాంత్ తల పగిలిందని, రమేశ్కు తల, కాళ్లు, మెడపై తీవ్ర గాయాలయ్యాయని, వాళ్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మెరుగైన చికిత్స చేయిస్తామని మంత్రి వివరించారు. ఘటనకు కారకులను వదలబోమని, పోలీసులు కూడా సరిగా ప్రవర్తించలేదని స్థానికులు చెబుతున్నారని, ఈ ఘటనపై విచారణ జరిపి దోషులుగా తేలిన వారిని ఎవరినీ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.
‘తెలంగాణకు మీరు ఇచ్చిన నిధులెన్ని..మంజూరు చేసిన ప్రాజెక్టులెన్ని.. ఇప్పటి వరకు చేసిన పనులెంటో ప్రజలకు సమాధానం చెప్పి పాదయాత్రకు వస్తే మేమే సాదరంగా స్వాగతిస్తాం.. అభివృద్ధి, సంక్షేమ ప్రదాత సీఎం కేసీఆర్ను విమర్శిస్తే మావాళ్లు అడ్డుకొని నిలదీస్తారు’ అని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. జనగామ టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి మంత్రి మాట్లాడారు.
బీజేపీ నాయకులు మత విద్వేషాలను రెచ్చగొడుడూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కేంద్రానికి ఇస్తున్నది..కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చిన నిధుల లెక్కను ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పారని, ప్రధానమంత్రి మొదలు, ఒక్క కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూడా సమాధానం చెప్పలేనప్పుడు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు అని మంత్రి ప్రశ్నించారు. ‘మీ పాదయాత్రను స్వాగతిస్తున్నా..రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి మీకు క్షేత్రస్థాయిలో అర్థమైతదని భావిస్తున్నాం.. వాస్తవాలు తెలుసుకొని పాదయాత్ర చేయాలి.. అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తించి ప్రకటించకపోతే నీ పాదయాత్రను మా పార్టీ శ్రేణులు అడ్డుకుంటారు’ అని మంత్రి స్పష్టం చేశారు.
‘రాష్ర్టానికి మీరు చేసిందేంటో చెప్పండి..17 మెడికల్ కాలేజీలు కావాలని అడిగాం.. ఒక్కటి కూడా ఇవ్వలేదు. కనీసం బీజేపీ ఎంపీలున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి చోట్ల కూడా మెడికల్ కాలేజీలు తెచ్చుకోలేని దద్దమ్మలు.. మత చిచ్చుపెట్టి పబ్బం గడపడమే తప్ప మీరు చేసిందేమిటి?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీలు ఏంచేశారు? గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమయ్యాయి? వరంగల్, జనగామ జిల్లాలకు మీరు చేసిందేమిటి? ఏ ముఖం పెట్టుకొని మా జిల్లాకు వస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువుతో అల్లాడే జనగామ ఇవ్వాళ సస్యశ్యామలమైందని, వలసపోయినవారే వాపస్ వస్తున్నారని, దీనికి కారణం ఎవరు? సీఎం కేసీఆర్ కాదా? అని మంత్రి సూటిగా ప్రశ్నించారు.
కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులతో సాగునీరు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు ఇస్తున్నామని, ఒక్క రైతుబంధు కిందనే జనగామ జిల్లాకు రూ.15వేల కోట్లు ఇచ్చామని, రైతుబీమా ఇస్తున్నామని, తండాలను పంచాయతీలుగా మార్చామని, మీరు చేసిన ఒక్క మంచి పని ప్రజలకు చెప్పండి అని నిలదీశారు. దద్దమ్మలు చేసే పాదయాత్రలను ప్రజలే అడ్డుకుంటారన్నారు.