సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశాబ్దాలుగా స్వయం ఉపాధి పొందుతున్న స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్టకొట్టే విధంగా వ్యవహరిస్తున్న రాంకీ సంస్థ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ, స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈమేరకు గురువారం లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట వందలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
రాంకీ వద్దు.. జీహెచ్ఎంసీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ స్వచ్ఛ ఆటో కార్మిక సంఘం నగర కార్యదర్శి జి.రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. హోటళ్లు, మాల్స్, అపార్ట్మెంట్లలో తమకే చెత్త వేయాలంటూ రాంకీ సంస్థ నోటీసులు జారీ చేస్తూ కార్మికుల రోజారీ ఆదాయానికి గండికొడుతోందని మండిపడ్డారు. దీనివల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందన్నారు ఆదాయంలో సగం వైద్య ఖర్చులకే.. డీజిల్ ఖర్చులు, మెయింటెనెన్స్ చార్జీలు, గ్లౌజులు, షూస్, సబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అవేవీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిరంతరం చెత్త సేకరణలో పాల్గొనడం వల్ల చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నామని, వచ్చిన ఆదాయంలో సగం ఆటో మెకానిక్ ఖర్చులకు, మిగతా సగం వైద్యానికే సరిపోతోందని వాపోతున్నారు. తమను జీహెచ్ఎంసీ వరర్లుగా గుర్తించి.. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, అర్హులైన కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ధర్నా అనంతరం జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రాహుల్ దేవ్ను కార్మిక సంఘాల నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు ఎం.దశరథ్, నాయకులు ఎం.మహేందర్, మున్సిపల్ వరర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు సి.మల్లేష్, నల్లపోతుల కృష్ణ కళ్యాణ్, నల్లబోతు మహేష్, మాండ్ల గిరి, నల్లబత్తుల మహేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.