న్యూఢిల్లీ, ఆగస్టు 20: బంగారం మళ్లీ పుంజుకుంటున్నది. గురువారం ఒకేరోజు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.4,300 ఎగబాకి మూడు నెలల గరిష్ఠ స్థాయి రూ.1.62 లక్షలు దాటింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.1,62,300 వద్ద ముగిసింది. డాలర్ బలహీనపడటంతో మదుపర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతకుముందు ఇది రూ.1.58 లక్షలుగా ఉన్నది.
మే 26న ముగిసిన రూ.1.62,400 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. బంగారంతోపాటు వెండి పరుగులు పెట్టింది. కిలో వెండి రూ.10 వేలు ఎగబాకి ఏడు వారాల గరిష్ఠ స్థాయి రూ.2.45 లక్షలకు చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.2.35 లక్షలుగా ఉన్నది. డాలర్ బలహీనపడటం, ట్రెజరీ ఈల్డ్స్ తగ్గుముఖం పట్టడం వల్లనే అతివిలువైన లోహాల ధరలు మూడు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 66.31 డాలర్లు తగ్గి 4,456.72 డాలర్లకు పడిపోగా, వెండి 2 శాతం దిగి 65.82 డాలర్లకు దిగొచ్చింది.