స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 9 : మహత్మగాంధీ తన జీవితాన్ని దేశానికి ఎలా అంకితం చేశారో భావి తరాలు తెలుసుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తహసీల్దార్ పూల్సింగ్ చౌహాన్ అన్నారు. మంగళవారం భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా డివిజన్ కేంద్రంలోని మహాలక్ష్మి సినిమా థియేటర్లో జ్యోతిరావు పూలే, మైనార్టీ గురుకుల విద్యార్థులకు గాంధీ సినిమాను ఉచితంగా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ పూల్సింగ్ మాట్లాడుతూ గాంధీజీ తన జీవితాన్ని ఎలా త్యాగం చేశారన్న విషయం 1982లో ఆస్కార్ అవార్డు పొందిన గాంధీ చిత్రం చూస్తే అర్థం అవుతుందన్నారు. సినిమా అనంతరం థియేటర్లో సైబర్ నేరాలు, గుడుంబా, గంజాయి, గుట్కా, గ్యాంబ్లింగ్ వంటి అలవాట్లతో జరిగే అనర్థాలను వివరించారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడాలని ఏసీపీ రఘుచందర్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై శ్రవణ్ కుమార్, ఆర్ఐలు రవీందర్, అర్జున్, జిల్లా సెక్టోరియల్ అధికారి నర్సింగరావు, మండల ఇన్చార్జి రాజేందర్, హెచ్ఎంలు మాధవీలత, గురుబ్రహ్మం, ఎమ్మార్సీలు గిరి, లవన్ పాల్గొన్నారు.
పాలకుర్తి : స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని థియేటర్లలో ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థుల కోసం రిచర్డ్ అటేన్ బరో దర్శకత్వంలో వహించిన గాంధీ చిత్ర వీక్షణకు విద్యార్థులు తరలి వచ్చారు.
మంగళవారం మండల కేంద్రంలో స్థానిక సినిమా థియేటర్కు కొడకండ్ల మండలంలో విద్యార్థులు స్కూల్ బస్సుల్లో వచ్చి గాంధీ సినిమా తిలకించారు. కార్యక్రమంలో తహసీల్దార్ భూక్యా పాల్సింగ్, ఎస్సై తాళ్ల శ్రీకాంత్, చెన్నూరు పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం పోతుగంటి నర్సయ్య, ఆర్టీవో శ్రీనివాస్రావు, డీటీఎస్ బాశెట్టి హరిప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.