జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పంటలు, ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలను అలర్ట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తెచ్చే బాధ్యతలను కలెక్టర్ గోపి స్పెషల్ ఆఫీసర్లకు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వరదలపై తాసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులతో సమీక్ష జరిపారు. జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ వర్ధన్నపేట, పర్వతగిరి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో నీటి వనరులను పరిశీలించారు. రావూరు గ్రామంలోని చెక్డ్యాంనూ సందర్శించి స్థానిక అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. వర్షాల దృష్ట్యా ప్రభుత్వం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో నెక్కొండ మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఉషాదయాళ్ వివిధ గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంటలను పరిశీలించారు.
వరంగల్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వానలోనూ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నీటి వనరులు, పంటల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. నష్టాలు వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మరో రెండు రోజు లు వర్షాలు పడుతాయనే సమాచారంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండొద్దని, కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్లలోని జనం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని చెబుతున్నా రు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ స్తంభాలు, వైర్లను తాకొద్దని వాడవాడనా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల నుంచి ఏకధాటిగా వాన పడుతుండడం తో ప్రతిరోజు వరద పరిస్థితి, నష్టాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. పరిస్థితిని పరిశీలించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తెచ్చే బాధ్యతలను జిల్లా కలెక్టర్ బీ గోపి స్పెషల్ ఆఫీసర్లకు అప్పగించారు. మండలానికో జిల్లా స్థాయి అధికారి ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక అధికారులు ఆయా మండలంలోని తాసిల్దార్, ఎంపీడీవో, ఎంపీవోతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమావేశమై వర్షం, వరద పరిస్థితిపై సమీక్ష జరిపారు.
స్థానిక అధికారులతో కలిసి గ్రామాలను సందర్శించారు. వరదతో పొంగి ప్రవహిస్తున్న వాగులు, ఒర్రెలు, చెక్డ్యాంలను, మత్తడి దుంకుతున్న, నీటితో నిండిన చెరువుల కట్టలను పరిశీలించారు. ముఖ్యంగా కట్టలకు బుంగలు పడే ప్రమాదం ఉన్న చెరువుల వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల సహకారంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ వర్ధన్నపేట, పర్వతగిరి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. జోరువానలో నీటి వనరులను పరిశీలించారు. పర్వతగిరి మండలం రావూరు గ్రామంలోని చెక్డ్యాంనూ స్వయంగా పరిశీలించి ముందుజాగ్రత్త చర్యల కోసం స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షం ముంచెత్తుతున్న తరుణంలో గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలకు సూచనలు చేశారు. డీఆర్డీవో ఎం సంపత్రావుతో పాటు పలువురు అధికారులు ఆయన వెంట ఉన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో కూడా అదనపు కలెక్టర్ హరిసింగ్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పలు కాలనీల్లో పర్యటించారు. ఎడతెరిపి లేని వర్షాల దృష్ట్యా ప్రభుత్వం కలెక్టరేట్లో కంట్రోల్రూం ఏర్పాటు చేసింది. మూడు షిఫ్ట్ల్లో ఉద్యోగులు కంట్రోల్ రూంలో విధు లు నిర్వర్తిస్తున్నారు. నిరంతరం సేవలందిస్తున్న ఈ కంట్రోల్ రూంలో 0870 2540345, 91542 52936 నంబర్లతో రెండు ఫోన్లు పనిచేస్తున్నట్లు అదనపు కలెక్టర్ హరిసింగ్ వెల్లడించారు. నర్సంపేట మున్సిపాలిటీలో కూడా వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో వార్డుకో స్పెషల్ అధికారి విధులు నిర్వర్తిస్తున్నారని, ఇప్పటివరకు జిల్లాలో నష్టాలేమి లేవని అదనపు కలెక్టర్ చెప్పారు.
మూడు చెరువు కట్టలకు బుంగలు
జిల్లావ్యాప్తంగా 29.06 సెంటీమీటర్లు వర్ష్షపాతం నమోదైంది. గీసుగొండలో 3.04, దుగ్గొండిలో 3. 22, నల్లబెల్లిలో 1.96, నర్సంపేటలో 2.04, ఖానాపురంలో 3.68, చెన్నారావుపేటలో 2.08, సంగెంలో 2.3, వర్ధన్నపేటలో 1.64, రాయపర్తిలో 2.1, పర్వతగిరిలో 2.3, నెక్కొండలో 2.58, వరంగల్లో 2.12 సెంటీమీటర్లు వర్షం కురిసింది. జోరువానతో జిల్లాలోని చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. జిల్లాలోని 13 మండలాల్లో 815 చెరువులు ఉంటే వీటిలో 193 నీటితో నిండి అలుగు పోస్తున్న ట్లు జలవనరుల శాఖ జిల్లా అధికారి మంగళవారం ప్రకటించారు. అత్యధికంగా నెక్కొండ మండలంలో 38, నర్సంపేట మండలంలో 36, నల్లబెల్లి మండలం లో 31 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మండలాలా వారీగా పర్వతగిరిలో 23, ఖానాపురంలో 18, చెన్నారావుపేటలో 18, రాయపర్తింలో 16, వరంగల్లో 3, దుగ్గొండిలో 3, సంగెంలో 5, వర్ధన్నపేటలో 1, ఖిలావరంగల్లో 1 అలుగు పోస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 378 చెరువుల్లోకి 75 నుంచి 100 శాతం నీరు చేరింది. మరో 211 చెరువుల్లో 50 నుంచి 75, ఇంకో 22 చెరువుల్లో 25 నుంచి 50 శాతం, మిగిలిన 11 చెరువుల్లో 25 శాతం నీరు నిం డింది. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు లో నీటిమట్టం 27 అడుగులు దాటింది. మూడు చెరువుల కట్టలకు బుంగలు పడ్డాయి. వీటిలో నెక్కొండ మండలం దీక్షకుంటలోని పెద్దదామెర చెరువు, చెన్నారావుపేట మండలం లింగగిరిలోని అక్కల్చెడ్ చెరు వు, నర్సంపేట మండలం మాదన్నపేటలోని దామెరకుంట ఉన్నట్లు అధికారులు తెలిపారు. వట్టివాగు అనకట్ట ఎడమ కాల్వ నెక్కొండ మండలం చిన్నకోర్పోలు వద్ద, ఎస్సారెస్పీ డీబీఎం 40లో ఎల్1 కెనాల్కు నర్సంపేట మండలం మహేశ్వరం వద్ద గండి పడింది. వర్షం, వరద పరిస్థితిపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మంగళవారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నెక్కొండ మండలంలోని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమీక్ష జరిపారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఉషాదయాళ్ వివిధ గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంటలను పరిశీలించారు. పంటలకు వాడాల్సిన ఎరువులు, పురుగు మందుల వినియోగంపై ఆమె రైతులకు సూచనలు చేశారు.