వరంగల్, ఏప్రిల్ 11 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టెన్త్ హిందీ పేపర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సంజయ్ విచారణ వ్యవస్థను బెదిరిస్తున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఇన్నాళ్లలో ఎప్పుడూ లేని విధంగా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. బండి సంజయ్ ఆరోపించినట్లుగా ఉద్యోగపరంగా తప్పు చేసినా, అక్రమ ఆస్తులున్నట్లు నిరూపించినా తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. టెన్త్ హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సంజయ్ తనను టార్గెట్ చేశారని, కేసులో ముద్దాయిగా ఉన్న వారు పోలీసులను తప్పుపట్టడం సహజమేనని అన్నారు. కేసుల విషయంలో పోలీసులకు వ్యక్తి గతంగా ఏమీ ఉండదు, ఉద్యోగపరంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. కేసులో ఉన్న కారణంగానే బండి సంజయ్ తనపై వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీజేపీ కార్యకర్తలను అడిగితే తన పనితీరు గురించి చెబుతారని అన్నారు.
వరంగల్ కమిషనర్గా ఐదు నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో ఎప్పుడూ తనపై మాట్లాడని బండి సంజయ్ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు లేని విమర్శలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు. విజయవాడలోని సత్యంబాబు కేసు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ కేసు గురించి బండి సంజయ్కి ఏం తెలుసు? సత్యంబాబు కేసుపై ఆయనకు అవగాహన లేదు. ఇప్పుడు సీబీఐ ఈ కేసును విచారిస్తున్నది. గతంలో తాను పని చేసిన ఖమ్మం, నల్లగొండ నుంచి నా బాధితులను తీసుకొస్తామని బండి సంజయ్ చెబుతున్నారు. తాను కొత్తగూడెం డీఎస్పీగా పనిచేశాను. నా బాధితులు అంటే ఎవరు వస్తారు? నా వల్ల అరెస్టయిన రౌడీషీటర్లు, పీడీ యాక్టు ఉన్న వారు, కబ్జా, చీటింగ్ కేసుల్లో అరెస్టయిన వారు ఉంటారు. కేసుల్లో అరెస్టయిన వారిలో కొందరికి మాపై కచ్చితంగా కోపం ఉంటుంది. లోఫర్లు, డాఫర్లు, చీటర్లు, రౌడీషీటర్లు మా బాధితులుగా ఉంటారు. వీరిని తీసుకొస్తే మంచిదే.
అప్పుడు లోఫర్లు, డాఫర్లు, చీటర్లు, రౌడీషీటర్ల బాధితులకు కూడా వాస్తవాలు చెబుతారు. వారు వచ్చి అన్ని విషయాలను వివరిస్తారు. సెటిల్మెంట్లు, దందాలు చేసి అక్రమాస్తులు ఉన్నట్లు బండి సంజయ్ ఆరోపించారు. ఒక్కటైనా తప్పుడు పద్ధతిలో చేస్తే, అక్రమ ఆస్తి ఒక్కటి అయినా ఉంటే యూనిఫాం విడిచి వెళ్లిపోతా. ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. వరంగల్ పోలీసు కమిషనర్గా చట్టం ప్రకారం పని చేస్తున్నా. భూకబ్జా కేసుల్లో మొదట బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేశాం. కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లను అరెస్టు చేశాం. ప్రతి వారం పోలీస్ కమిషరేట్లో జరిగే ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి బండి సంజయ్ వస్తే ఏం జరుగుతున్నదో తెలుస్తుంది. ఒక్కో రోజు 600 మంది వరకు వస్తారు. వారంతా సామాన్యులు, పేదవాళ్లే. వారి తరఫున ఎవరూ రారు. ఇక్కడ మధ్యవర్తులు, దళారులు ఉండరు.
వ్యవస్థపై నమ్మకం ఉన్నందునే వస్తున్నారు. పోలీసు స్టేషన్ న్యాయానికి తొలిమెట్టు అనేదాన్ని నమ్ముతాను. న్యాయం ఇచ్చేలా పోలీసుస్టేషన్ పని చేయాలని భావిస్తాను. తప్పు చేసిన వారు ఎవరైనా చర్యలు తీసుకుంటాం. భూకబ్జా కేసుల్లో అన్ని పార్టీల వారిని అరెస్టు చేశాం. నాకు ఇక్కడ పాలాభిషేకాలు చేస్తుంటే అలాంటివి చేయవద్దని, ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్నానని విజ్ఞప్తి చేశా. విధుల పరంగా ఏ తప్పు చేయను. రాత్రి గుండెమీద చెయ్యేసి ప్రశాంతంగా నిద్రపోతా. పరీక్ష పత్రం మాల్ ప్రాక్టీసు కేసు వ్యవహారానికి సంబంధించి చాలా మందికి నోటీసులు పంపాం. వీరిలో మీడియా ప్రతినిధులు ఉన్నారు. వాళ్లనూ పిలుస్తాం’ అని పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ తిరుమల్ పాల్గొన్నారు.