హనుమకొండ, జూన్ 15 : త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లను ప్రారంభించాలని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై గురువారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్యతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ముందస్తుగా పూర్తి స్థాయి సన్నాహాలు ప్రారంభించాలని, సమష్టిగా కృషి చేసి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో 100 శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించడంలో పోలీసు, రెవెన్యూ అధికారులదే కీలక పాత్ర అని అన్నారు. ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు సిబ్బందిని సమాయత్తం చేయాలన్నారు. జిల్లాలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ తకువగా నమోదైన ప్రాంతాల్లో ఓటు ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు సృష్టించేలా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను సకాలంలో తిప్పికొట్టేందుకు మీడియా బృందాలను నియమించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ప్రజలకు కచ్చితమైన, ప్రామాణికమైన సమాచారం ఇవ్వడం అధికారుల బాధ్యత అని అన్నారు. ఎన్నికల సందర్భంగా వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కేటాయించినట్లు తెలిపారు. నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే నియోజకవర్గాల ఆధారంగా లిస్ట్లను రూపొందించాలని సూచించారు. అక్రమ మద్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, వ్యాపారులతో అవగాహన కార్యక్రమలను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ శాతం పెరిగేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్లు, అవగాహన సదస్సులు చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, విధులపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు జీ సంధ్యారాణి, అశ్విని తానాజీ వాకడే, డీఆర్వో ఎం వాసుచంద్ర, పరకాల ఆర్డీవో రాము, తహసీల్దార్లు జీ రాజ్కుమార్, కిరణ్ కుమార్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.