బచ్చన్నపేట, ఆగస్టు 4 : జనగాం జిల్లా బచ్చన్నపేటలోని దేశాయ్ బీడీ సెంటర్ను దుద్దెడకు తరలించే యాజమాన్య నిర్ణయానికి వ్యతిరేకంగా బీడీ కార్మికులు, ప్యాకర్లు, వర్కర్లు మంగళవారం ఆందోళనకు దిగారు. తమ జీవనోపాధిని దెబ్బతీసే ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బచ్చన్నపేట దేశాయ్ బీడీ సెంటర్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. 1984లో ప్రారంభమైన దేశాయ్ బీడీ సెంటర్ నాలుగు దశాబ్దాలుగా బచ్చన్నపేట ప్రాంతంలోని వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ వస్తోందన్నారు.
తమ శ్రమతో కంపెనీ అభివృద్ధి చెందిందని, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా లేదా కార్మికులతో చర్చించకుండా సెంటర్ను దుద్దెడకు తరలించాలని యాజమాన్యం నిర్ణయించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాయ్ బీడీ కార్మికుల బచ్చన్నపేట మండల అధ్యక్షుడు దమ్ము మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సెంటర్ను దుద్దెడకు తరలించే నిర్ణయం కార్మికుల పొట్టపై కొట్టినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని బచ్చన్నపేటలోనే సెంటర్ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేశాయ్ బీడీ కార్మికులు పోచంపల్లి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, దుర్గారెడ్డి, మార్క సంతోష్, కృష్ణమూర్తి, పోచంపల్లి శ్రీనివాస్, యాదగిరి, కనకయ్య, యాదిరెడ్డి, లక్ష్మి, సరిత, జ్యోతి, కవిత, శ్రీలత, స్వప్న, మంజుల, లలిత, కిష్టయ్య, ఎండీ అప్రోజ్ తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.