హనుమకొండ చౌరస్తా, మార్చి 30 : హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (స్వయంప్రతిపత్తి) వృక్షశాస్త్ర విభాగ అధ్యాపకుడు రూపొందించిన ‘ప్లాంట్ టిష్యూ కల్చర్ ప్రాసెసింగ్ పరికరం’ నమూనాకు యునైటెడ్ కింగ్డమ్ నుంచి డిజైన్ రిజిస్ట్రేషన్ లభించింది. ఈ డిజైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 6507219 కాగా 16 ఫిబ్రవరి 2026న రిజిస్ట్రేషన్, 13 మార్చి 2026న గ్రాంట్ మంజూరైంది. ఈ పరిశోధనలో ప్రధాన పరిశోధకుడిగా డాక్టర్ తిరునహారి యుగంధర్ పనిచేశారు. ఈ పరికరం ప్లాంట్ టిష్యూ కల్చర్ ప్రయోగశాలలలో ఉపయోగించేవిధంగా రూపొందించబడింది.
ఇందులో పై భాగంలో డిస్ప్లే వ్యవస్థ, మధ్యలో పారదర్శక టిష్యూ కల్చర్ ప్రాసెసింగ్ ఛాంబర్, కింది భాగంలో కల్చరల్ ట్యూబ్స్ కోసం ప్రత్యేక విభాగాలు, గాలి ప్రసరణ కోసం వెంటిలేషన్ సదుపాయాలు ఉన్నాయి. ఈ పరికరం ద్వారా అరటి, చెరకు, బంగాళాదుంప, ఆర్కిడ్స్, ఔషధ మొక్కల టిష్యూ కల్చర్ ప్రక్రియను సులభంగా, సమగ్రంగా నిర్వహించవచ్చని పరిశోధకుడు డాక్టర్ తిరునహరి యుగంధర్ తెలిపారు.
ఈ డిజైన్ రిజిస్ట్రేషన్ పొందిన బృంద సభ్యుల్లో తిరునహారి యుగంధర్ (ప్రధాన పరిశోధకుడు), ఎలూరి కోమల, సూరా శ్యామ్ప్రసాద్, దాసరి సమ్మయ్య, మేడిశెట్టి నరేందర్, ఘన్సింగ్ మలోతు, గాంధీ నేమలి, మార్డా రాంబాబు, గోగికార్ భగీరథ్, ధరావత్ పార్వతి, సహాయ పరిశోధకులుగా పనిచేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, రాజశేఖర్, ఇతర అధ్యాపకులు బృంద సభ్యులను అభినందించారు.