బచ్చన్నపేట మార్చి 25 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో పూర్తిగా అధ్వానంగా మారిన రోడ్డుపై అధికారులు ప్యాచ్ వర్క్ వేయడం కాదని, పర్మనెంట్ రోడ్డు వేస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని బచ్చన్నపేట పట్టణ ప్రజలు సూచిస్తున్నారు. స్థానిక ఎస్సార్ పెట్రోల్ బంక్ నుండి కొడవటూరు కమాన్ వరకు గుంతల మయంతో అతి ప్రమాదకంగా మారిన రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ‘ఫైట్ ఫర్ బచ్చన్నపేట’ ఆధ్వర్యంలో ఆందోళనలు రాస్తారోకోలు ధర్నాలు నిర్వహించిన ప్రభుత్వం పట్టించుకోవ డంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గుంతలుగా మారిన రోడ్డుపై వాహనాలు వెళ్తుంటే దుమ్ము లేచి వ్యాపార, వాణిజ్య వర్గాలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.
దుమ్ము, ధూళితో అనారోగ్యం బారిన పడుతున్నారని వెల్లడించారు. జాతీయ రహదారిలో ఉన్న బచ్చన్నపేట మండల కేంద్రంలో కనీసం రోడ్డు బాగు చేయించే పరిస్థితి లేకపోవడం విచారకరమన్నారు. ఆందోళన చేసినా పట్టించుకోవడం నాథుడే లేరన్నారు. ప్రమాదకరంగా మారిన ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ ఎంతోమంది గాయాల పాలవుతున్నారని అన్నారు. పర్మినెంట్ రోడ్డు కావాలని ఆందోళన చేస్తే అధికారులు తూతు మంత్రంగా ప్యాచ్ వర్క్ లు చేయడం సరిదన్నారు. ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించి, పర్మనెంట్ బీటీ రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.