హనుమకొండ సబర్బన్, జనవరి 24 : విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ (ఏసీడీ) నిర్ణయం తమ సొంత నిర్ణయం కాదని, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (ఈఆర్సీ) నిబంధనల మేరకే ఏసీడీ వసూలు చేయనున్నట్లు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సీఎండీ అన్నమనేని గోపాల్ రావు స్పష్టం చేశారు. ఏసీడీపై కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సీఎండీ హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వినియోగదారులు నూతనంగా విద్యుత్ కనెక్షన్ తీసుకునేటప్పుడు నామ మాత్రపు డిపాజిట్ మాత్రమే చెల్లిస్తారని వివరించారు. వారు కొన్నాళ్ల పాటు విద్యుత్ను వినియోగించుకున్న తర్వాతనే వినియోగం లోడ్ తెలుస్తుందని చెప్పారు. దాని ప్రకారమే వారిపై ఏడీసీ విధించనున్నట్లు తెలిపారు. విద్యుత్ కనెక్షన్ తీసుకునేటప్పుడే ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఈ నిబంధనలన్నీ దరఖాస్తులో పొందుపరుస్తాయని పేర్కొన్నారు. వెబ్సైట్లో చూసుకున్నా స్పష్టంగా ఉంటుందని తెలిపారు. విద్యుత్ కనెక్షన్ తీసుకున్న నెల రోజుల తర్వాత మొదటి నెల బిల్లు వస్తుందని, అది చెల్లించేందుకు 15 రోజుల గడువు ఉంటుందని, సర్చార్జితో కలిపి మరో 15 రోజుల గడువు ఉంటుందని పేర్కొన్నారు.
అంటే మొదటి బిల్లు చెల్లించేందుకు వినియోగదారుడికి రెండు నెలల గడువు ఉంటుంది. ఈ రెండు నెలల్లో వినియోగదారుడు ఒప్పందం లోడుకు మించి అదనంగా విద్యుత్ను వాడుకుంటే ఏసీడీని క్రమబద్ధీకరించుకోవాలి. అది కూడా ప్రతి కిలోవాట్కు కేవలం రూ.200 చెల్లిస్తే సరిపోతుందని సీఎండీ వివరించారు. ఈ క్రమంలో 100 యూనిట్ల లోపు అయితే రూ.298, 150 యూనిట్లకు రూ.800, 200 యూనిట్లకు రూ.1664, 250 యూనిట్లకు 4 శాతం, 300 యూనిట్లకు 1 శాతం మాత్రమే ఏసీడీ రూపేణా వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ ఈఆర్సీ 2004 సెక్షన్ 6 ప్రకారమే వసూలు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన డిపాజిట్లకు కూడా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనల ప్రకారం వడ్డీని లెక్కించి ప్రతి నెల విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేస్తామని చెప్పారు. ఈ డిపాజిట్ను విద్యుత్ బిల్లుగా పరిగణించొద్దని, ఇది కేవలం మీ పేరుతో మా వద్ద ఉండే ఫిక్స్డ్ డిపాజిట్గా మాత్రమే చూడాలని సూచించారు.
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనే బిల్లులు చెల్లించని వారు 7 లక్షల 16 వేల మంది వినియోగదారులున్నారని, వారి నుంచి సంస్థకు 305 కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు. బకాయిలు భారీగా పేరుకుపోవడం వల్ల విద్యుత్ తయారీ సంస్థలకు సకాలంలో బిల్లులు చెల్లించలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సైతం నాణ్యమైన విద్యుత్ను అందించామని, ఇలాంటి విద్యుత్ సంస్థలను కాపాడుకోవాలని కోరారు. ఇప్పటికే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించిందని వెల్లడించారు. గతంలో కాకుండా ప్రభుత్వం నుంచి సైతం విద్యుత్ సంస్థలకు మంచి ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. వ్యవసాయం, గృహ, ఎస్సీ, ఎస్టీ, కులవృత్తులు, పరిశ్రమలు, కోళ్ల ఫారాలు సబ్సిడీల కోసం రాష్ట్రంలోని రెండు డిస్కంలకు రూ.26 వేల కోట్లు ఇచ్చిందని వివరించారు. సమావేశంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, గణపతి, సంధ్యారాణి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలు లేని గ్రామాలే లక్ష్యం..
విద్యుత్ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అన్ని స్థాయిల ఉద్యోగులు పని చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు అదేశించారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్, కామారెడ్డి, జిల్లాల ఎస్ఈలు, డీఈలు, ఎస్ఏవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ అధికారులు దతత్త తీసుకున్న గ్రామాల్లో కాలిపోయిన, పని చేయని విద్యుత్ మీటర్లు ఉండకూడదన్నారు. బిల్లుల చెల్లింపులో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించాలని కోరారు. ఓవర్లోడెడ్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రూ.50 వేల పైబడిన బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మంజూరై రెండు సంవత్సరాలు పైబడిన వర్క్ ఆర్డర్లను పూర్తి చేయాలన్నారు.