బచ్చన్నపేట, జూన్ 2 : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్థూపానికి, ప్రజాకవి కాలోజీ నారాయణరావు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు.
జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు అంటూ చేసిన నినాదాలతో చౌరస్తా మార్మోగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫిరోజ్ మాట్లాడుతూ.. ఎందరో అమరవీరుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. నాటి ఉద్యమ స్ఫూర్తిని గుండెల్లో ఉంచుకుని, రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు కోనేటి స్వామి, గౌరవ సలహాదారులు నల్లగోని బాలకృష్ణ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గౌరవ సలహాదారులు బోడకుంటి మల్లయ్య, దొంతుల చంద్రమౌళి, అల్లాదుర్గం వెంకటేశ్వర్లు, ఫోరం ప్రధాన కార్యదర్శి రాపేల్లి వెంకటేశ్వర్లు గిరబోయిన బాల్ సిద్ధులు, ఎండీ జావిద్, షబ్బీర్, ముసిని శ్రీశైలం గౌడ్, అఖిల్ మాల, మల్లయ్య, వార్డు సభ్యులు కర్రె ప్రశాంత్, మినలాపురం మల్లేశం పాల్గొన్నారు.