హనుమకొండ చౌరస్తా, జూన్ 8 : బీఆర్ భగవాన్ దాస్ పోరాటంతోనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమ రూపం సంతరించుకుని నేడు నిజం కాబోతున్నదని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. సోమవారం సీనియర్ కమ్యూనిస్టు యోధుడు, కార్మిక నాయకులు బీఆర్ భగవాన్ దాస్ 96వ జయంతి వేడుకలు హనుమకొండ జూనియర్ కాలేజీ జంక్షన్ లోని బీఆర్ భగవాన్ దాస్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు బీఆర్ భగవాన్ దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ భగవాన్ దాస్ పోరాటంతోనే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమై నేడు పూర్తి కాబోతున్నదని, తద్వారా ఈ ప్రాంతంలో వేలాది మంది యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు అందనున్నాయని అన్నారు. అలాగే వరంగల్ కు తాగు నీరు, సాగునీటి కోసం బీఆర్ భగవాన్ దాస్ పోరాడాలని, భూ పోరాటాలు నిర్వహించి పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు సాధించి పెట్టారని అన్నారు. తన జీవిత కాలం బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన భగవాన్ దాస్ రాష్ట్ర స్థాయిలో సిపిఐకి పేరు తీసుకు వచ్చారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ ఎప్పుడూ మిత్ర పక్షాలుగా కొనసాగుతూ రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి ముందుకు సాగుతున్నాయని అన్నారు.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భగవాన్ దాస్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన పోరాటంతోనే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని అన్నారు. బీఆర్ ఆశయాలకు అనుగుణంగా మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. భగవాన్ దాస్ చూపిన బాటలో కమ్యూనిస్టు కార్యకర్తలుగా ముందుకు సాగుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, భగవాన్ దాస్ కుమారులు డాక్టర్ బి. రాజ్ సిద్దార్థ, బీఆర్ లెనిన్, బిఆర్ఎస్ నాయకులు మేడిపల్లి శోభన్ బాబు, ఆవోపా జిల్లా అధ్యక్షులు డి. ఈశ్వరయ్య, జర్నలిస్టు సంఘాల నాయకులు తోట సుధాకర్, కేకే, పి. అశోక్, గోకారపు శ్యామ్, బొడిగె శ్రీను,సిపిఐ జిల్లా నాయకులు మునిగాల బిక్షపతి, నేదునూరి రాజమౌళి, ఏదునూరి వెంకట్రాజం, కొట్టెపాక రవి, బికేఎంయూ జాతీయ నాయకులు మోతె లింగారెడ్డి, నాయకులు గుండె బద్రి, కండె నర్సయ్య, మాలోతు శంకర్ నాయక్, ఎం. స్వామి చరణ్, రవీందర్, జితేందర్ పాల్గొన్నారు