పరకాల, మే 31: ప్రజల భద్రతల సంరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఏసీపీ సతీశ్ బాబు అన్నారు. శనివారం స్థానిక పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా పరకాల పట్టణంలోని పాత సీఎంఎస్ గోడౌన్స్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా హుజురాబాద్ రోడ్డులోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు పోలీస్ కవాతు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ సతీశ్ బాబు మాట్లాడుతూ పహాల్గాం ఘటన ద్వారా దేశ ప్రజల్లో అలజడి రేగినప్పటికీ ఆపరేషన్ సిందూర్ ద్వారా విజయం సాధించి ఆత్మవిశ్వాసం చాటడం జరిగిందని అన్నారు. అదే క్రమంలో దేశం, రాష్ట్రంతో పాటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో సైతం ఎలాంటి క్రౌడ్ కంట్రోల్ పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కోడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తాము ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఎవరైనా పరిచతులను గమనించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.