హనుమకొండ చౌరస్తా, జూలై 10: తెలంగాణ రాష్ర్టంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ విద్యారంగాభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం తప్పదని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడం చేతగాకపోతే వెంటనే రేవంత్రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహించిన రాష్ర్టవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది.
జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో తరగతులు బహిష్కరించి బంద్ నిర్వహించగా, ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్ పాటించాయి. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కాకతీయ యూనివర్సిటీ ఎస్.డి.ఎల్.సి.ఇ. జంక్షన్ నుంచి వందలాది మంది విద్యార్థులతో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం విద్యార్థులతో భారీ ర్యాలీ తీసి, లష్కర్బజార్ మర్కజి స్కూల్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించగా పోలీసులు విద్యార్థి సంఘల నాయకులను అరెస్టు చేసి హనుమకొండ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల జిల్లా బాధ్యులు బాషబోయిన సంతోష్ (ఏఐఎస్ఎఫ్), మంద శ్రీకాంత్ (ఎస్ఎఫ్ఐ), బి.నరసింహారావు(పి.డి.ఎస్.యు), మాస్ సావిత్రి (ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్), మర్రి మహేష్ (పి.డి.ఎస్.యు), రోహిత్ (ఏ.ఐ.ఎస్.బి), వెంకటేష్ (ఎ.ఐ.డి.ఎస్.ఓ)లు మాట్లాడుతూ రాష్ర్టంలో రేవంత్రెడ్డి పాలనలో విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
రాష్ర్టంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆలోచనను రాష్ర్ట ప్రభుత్వం వెంటనే విరమించుకోని, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తూ సమగ్ర చట్టాన్ని రూపొందించాలన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న 9వేల కోట్ల రూపాయల స్కాలర్ షిప్, ఫీజు రీఎంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు విడుదల చేయాలని, తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని, విద్యార్థులందరికీ ఉచిత బస్ సౌకర్యం కల్పించాలన్నారు.
ఇంటర్, డిగ్రీ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించి, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బిసి, ఎస్ఎంఎస్ హాస్టల్స్కు సొంత భవనాలు నిర్మించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు స్టాలిన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉట్కూరీ ప్రణీత్, పి.డి.ఎస్.యు జిల్లా నాయకులు వంగేటీ మోహన్, ఏ.ఐ.ఎస్.బి జిల్లా నాయకులు మిస్బా, తాజుద్దీన్, సమీర్, పి.డి.ఎస్.యు. జిల్లా నాయకులు వంశీ, కార్తీక్, ఏ.ఐ.డి.ఎస్.ఓ. జిల్లా నాయకులు మధు, సురేష్ పాల్గొన్నారు