హనుమకొండ, జూన్ 18: దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న యాదవ జాతికి మంత్రివర్గంలో చోటు లేకపోవడం సిగ్గుచేటని అఖిల భారత యాదవ సంఘం సభ్యుడు, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. హనుమకొండ రాంనగర్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు లేరు అనే సాకుతో యాదవ జాతిని వెనకబాటుకు గురిచేయొద్దని అన్నారు. నీతికి, నిజాయితీకి ప్రతీక యాదవ జాతి అని చెప్పే కాంగ్రెస్ పెద్దలు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంచి మనస్సుతో అలోచించి యాదవ కులానికి పదవి మంత్రి పదవి ఇవ్వాలన్నారు.
ఈ నెల 30వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్కులో నిర్వహించే యాదవుల ఆత్మగౌరవ సభకు యాదవ బిడ్డలంతా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునించారు. అఖిల భారత యాదవ సంఘం సభ్యుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కనివిప్పు కలిగేలా సభ ఉండబోతోందని అన్నారు. తెలంగాణ రాష్ర్టంలో యాదవులకు మంత్రి పదవి లేకపోవడం దుర్మార్గపు చర్య అని అభివర్ణించారు. హిందూ జాతికి భగవద్గీతను అందించిన జాతి యాదవ జాతి అని, తెలంగాణలో గోల్కొండను నిర్మించిన చరిత్ర యాదవ జాతిదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ నింపబోయే కేబినెట్ పదవుల్లో యాదవ జాతికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. అలాగే జనాభా దామాషా పద్దతిలో యాదవులకు రావాల్సిన నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిపిన సమగ్ర కుటంబ సర్వేలో ముస్లింలు లేకుండా బీసీలు 52శాతం ఉన్నారని, కానీ ఇప్పుడు ముస్లింలను కలుపుకొని 56శాతం బీసీలు ఉన్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
యాదవులు, మున్నూరుకాపులు లేని మంత్రి మండలి ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్కు మున్నూరుకాపులు కే కేశవరావు, డీఏస్ లాంటి వారు ఎన్నో సేవాలు చేశారని చెప్పారు. బీసీలకు మంత్రి మండలిలో సమూచిత స్థానం కల్పించాలని బీసీ కులాల లెక్కన 9 మందికి చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. యాదవులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రెండో విడత గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలని అన్నారు. అనంతరం గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతూ చరిత్రలో యాదవులు లేకుండా మంత్రి మండలి లేదని, యాదవ మంత్రి లేకుండా పాలన చేస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. యాదవులను మరిచిపోతే కచ్చితంగా తగిన మూల్యం చెల్లిస్తారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా చాటుతామని హెచ్చరించారు. సమావేశంలో మేకల కృష్ణ యాదవ్, గీరబోయిన రాజయ్య యాదవ్, మాదం రజనీ కుమార్, సిద్దిరాజు యాదవ్, గండ్రకోట రాకేష్ యాదవ్, పృథ్వీ యాదవ్, ప్రమోద్ యాదవ్, సాయి యాదవ్, రాజు యాదవ్ పాల్గొన్నారు.