హనుమకొండ చౌరస్తా, మార్చి 10 : విద్య ద్వారానే మహిళల అభ్యున్నతి సాధ్యమని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ నిర్వహించిన సావిత్రిబాయి ఫులే 129వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా దూరవిద్య ప్రాంగణంలోని ఫులే దంపతుల విగ్రహాల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ సావిత్రిబాయి ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం విద్యార్థులు, ఉద్యోగులతో మాట్లాడుతూ నేటి మహిళా విద్యకు సావిత్రిబాయి ఫులే చేసిన సేవలు అమూల్యమని, ఆమె కృషి ఫలితంగానే మహిళా విద్యకు బాటలు పడినట్లు తెలిపారు. భారతదేశంలో సగభాగమైన మహిళలు విద్యావంతులు అయినప్పుడు దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ ఆచార్య వల్లూరి రామచంద్రం మాట్లాడుతూ అసమానతలు, వివక్షలను ఎదుర్కొన్నప్పటికీ తన లక్ష్యాన్ని విడిచిపెట్టని మహనీయురాలు సావిత్రిబాయి ఫులే అని అన్నారు.