ఐనవోలు, (హనుమకొండ) : అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఐనవోలు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు గురైన బాధితులను, ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగులను వరంగల్ ఎంజీఎంకు తరలించడానికి గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రాణదాతలాంటి అంబులెన్స్ సేవల కోసం ఐనవోలు మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సాధారణంగా ప్రతి మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం ఉండాలి. అయితే ఐనవోలు మండలానికి కొత్త అంబులెన్స్ కేటాయించినప్పటికీ.. మండల కేంద్రంలో ఆ అంబులెన్స్ సేవలు తక్కువే. అనేక కారణాలతో ఆ వాహనం జిల్లా కేంద్రంలోనే ఉండడమే అందుకు కారణం. అంబులెన్స్ 6 నెలలు సేవలందిస్తే.. మరో నెలలు పలు కారణాలతో అందుబాటులో ఉండకపోవడంతో మండల వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా మొత్తంగా 41 వేల జనాభా ఉంది. ఆయా గ్రామాల్లోని ప్రజలు ప్రమాదాలు, అనారోగ్యానికి గురైనప్పుడు వారిని దవాఖానకు తరలించాలంటే పక్క మండలాల నుంచి అంబులెన్స్ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కోసారి అక్కడ కూడా అంబులెన్స్ లేనప్పుడు ప్రైవేట్ వాహనాలనే నమ్ముకోవాల్సిన పరిస్థితి.
మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ శుక్రవారం మధ్యాహ్నం సుమారుగా 2:20 నిమిషాలకు ప్రమాదశాత్తు బాత్రూం వద్ద జారి పడింది. ఆమెను ఆస్పత్రికి తరిలించేందుకు స్థానికులు వెంటనే108 వాహనానికి ఫోన్ చెయ్యగా అంబులెన్స్ అందుబాటులో లేదని చెప్పారు. కాజీపేట నుంచి అంబులెన్స్ వస్తుందంటూ ఒక గంట పాటు కాలయాపన చేశారు. చివరకు అంబులెన్స్ 3:20 నిమిషాలకు వచ్చింది. సదరు మహిళలకు తలపై తీవ్రంగా గాయాలు కాగా అంబులెన్స్ కాలయాపన కారణంగా తీవ్రంగా రక్తం కోల్పోయిందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని ఐనవోలు మండలంలో నిత్యం అంబులెన్స్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.