హనుమకొండ, నవంబర్ 27: సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేవారి కోసం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు తొలిరోజు ఆదివారం భారీ స్పందన వచ్చింది. ఉదయం పది గంటలకు ఎక్స్పోను మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ప్రారంభించారు. షోలో హనుమకొండ, వరంగల్తో పాటు హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ సంస్థలు, బ్యాంకులు మొత్తం 15 స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వెంచర్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు, నిర్మాణం కోసం బ్యాంకులు అందించే రుణాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఓపికగా సందర్శకులకు అందించాయి. హరిత హోటల్లో ప్రాపర్టీ షో గురించి తెలిసి వేలాది మంది ఔత్సాహికులు తరలివచ్చి తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇలాంటి ప్రాపర్టీ షోలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఇండ్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, వెంచర్లు, బ్యాంకు రుణాల పూర్తి సమాచారాన్ని ఒకే వేదిక వద్ద తెలుసుకొనే అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉందని పలువురు సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రాపర్టీ షో స్పాన్సర్లు ..
రెండు రోజుల పాటు హరిత కాకతీయ హోటల్లో కొనసాగే ప్రాపర్టీ షోకు మెయిన్ స్పాన్సర్గా ఏవీ ఇన్ఫ్రాకాన్, అసోసియేట్ స్పాన్సర్గా బిల్లా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్, గిఫ్ట్ స్పాన్సర్గా నీలోఫర్, అసోసియేషన్ విత్గా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డబ్ల్యూడీసీసీబీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు, కనకదుర్గా హోమ్స్, మైత్రీ ఇన్ఫ్రా ప్రాజెక్టు, జీఎంఆర్ గోకులం, మేఘా, అవని, జేఎస్ఆర్ సన్సిటీ, శాశ్విత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి.
తరలివచ్చిన ప్రజాప్రతినిధులు
తొలిరోజు ప్రాపర్టీ షోకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, డీసీసీబీ జీఎం శ్రీధర్, ఏజీఎం రాజశేఖర్, పర్వతగిరి జడ్పీటీసీ సింగూలాల్, భీమదేవరపల్లి జడ్పీటీసీ వంగ రవీందర్రెడ్డి, ఎల్కతుర్తి ఎంపీపీ మేకల స్వప్న, హనుమకొండ టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, నాయకులు శ్యాంసుందర్, పుల్లూరి వేణుగోపాల్, రాజీవ్, రామునాయక్, రాజమౌళి హాజరయ్యారు.
ఇద్దరికి బహుమతులు
తొలిరోజు ప్రాపర్టీషోకు వచ్చినవారిలో ఇద్దరికి బహుమతులు వచ్చాయి. షోలో స్టాళ్లను సందర్శించేందుకు వచ్చిన వారు తమ పూర్తి వివరాలను ఫారంలో నింపి బాక్స్లో వేశారు. వాటిని డ్రా తీయగా వరంగల్ నగరంలోని 16వ డివిజన్ ధర్మారానికి చెందిన గుంట రాజకుమార్, హనుమకొండకు చెందిన పసునూరి మహేందర్రెడ్డి ఎంపికయ్యారు. వీరికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు.