ఐనవోలు : (హనుమకొండ) మల్లికార్జునస్వామి కోలువుదీరిన ఐనవోలు గ్రామాన్ని బెల్ట్ షాపుల రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందామని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గడ్డం రఘువంశీ పిలుపు నిచ్చారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో చేసిన బెల్ట్ షాపుల బంద్ తీర్మానం గ్రామంలో నేటి నంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. మహిళా సంఘాలు, యువకులు, నాయకులతో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు.
గ్రామంలోని బెల్ట్ షాపుల వల్ల వయసుతో సంబంధం లేకుండా తాగుడుకు బానిసాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల కోరిక మేరకు బెల్ట్ షాపులను నిషేధిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ తీర్మానానికి వ్యతిరేకంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ.10 వేల జరిమానాతో పాటు సంక్షేమ పథకాలకు కట్ చేస్తామని హెచ్చరించారు. బెల్ట్ షాపు రహిత గ్రామంగా తయారు చేయడానికి గ్రామస్తులందరు సహకరించాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో పంచాయతీ సెక్రటరీ కిశోర్, ఉప సర్పంచ్ బరిగెల భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.