ధర్మసాగర్ : క్రాప్ లోన్ రెన్యువల్ కోసం అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. బ్యాంకుల పెట్టే షరతులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు యూరియా బుకింగ్ కోసం, ఇటు పంటలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్న రైతులకు బ్యాంకులతోనూ తిప్పలు తప్పడం లేదు. తాము తీసుకున్న క్రాప్ లోన్ రెన్యువల్ కోసం బ్యాంకులకు వెళ్తే అసలు, వడ్డీ కలిపి చెల్లించాలంటున్నారు. దీంతో సమయానికి డబ్బులు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ సకాలంలో లోన్ రెన్యువల్ చేసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీని కోల్పోతున్నారు.
ఈ నేపథ్యంలో రైతులు కమీషన్ ఏజెంట్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. వీరి అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న ఏజెంట్లు ఒక్క రోజుకే రూ. లక్షకు రూ.2 వేలు కమీషన్ తీసుకుంటున్నట్లు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని ఓ రైతుకు బ్యాంకులో రూ.2 లక్షల క్రాప్ లోన్ ఉండగా దాని రెన్యువల్ కోసం కమీషన్ ఏజెంట్ వద్దకు వెళ్లగా అతడు అసలు, వడ్డీ చెల్లించాడు. సాయంత్రం వరకు బ్యాంకు అధికారి లోన్ రెన్యువల్ చేయడంతో కమీషన్ ఏజెంట్ రైతు వద్ద రూ. 4 వేల తీసుకున్నాడు. ఈ సమస్య క్రాప్ లోన్ ఉన్న రైతులందరిదని వారు వాపోతున్నారు.
ఈ విషయమై రైతులు బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు అసలు, వడ్డీ చెల్లిస్తేనే రెన్యువల్ చేస్తున్నామని చెబుతున్నట్లు వెల్లడించారు. అయితే గత ఏడాది వరకు రైతులు కేవలం వడ్డీ చెల్లించి క్రాప్ లోన్ రెన్యు వల్ చేసుకునేవారు. ప్రస్తుతం బ్యాంకుల కోర్రీలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలు వురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వడ్డీ చెల్లిస్తే లోన్ రెన్యువల్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
వడ్డీ భారం పెరిగింది..
పంట పెట్టుబడి కోసం తీసుకున్న రూ.90 వేలు రుణాన్ని రెన్యువల్ చేయడానికి బ్యాంకుకు వెళ్తే మొత్తం డబ్బులు చెల్లించాలన్నారు. దీంతో సకాలంలో డబ్బులు కట్టకపోవడంతో వడ్డీ భారం పెరగడంతో పాటు రాయితీ కూడా రాలేదు. నాలాంటి చాలా మంది రైతులు కమీషన్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నరు. గత ఏడాది వడ్డీ చెల్లిస్తేనే లోన్ రెన్యువల్ చేశారు. బ్యాంకుల్లో వచ్చిన మార్పుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వాలి.
౼ చేగొండ రంజిత్, యువ రైతు, ధర్మసాగర్ మండలం