హనుమకొండ చౌరస్తా, మార్చి 17: వ్యాపారి చేతిలో మోసపోయిన ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..వరంగల్లోని లక్ష్మీనారాయణ అనాజ్ కిరాణం హోల్సేల్ వ్యాపారి గుండా రఘురాం చేతిలో దారుణంగా మోసపోయామని, తమకు జరిగిన అన్యాయంపై ఎక్కడా న్యాయం జరగడం లేదని బాధితుడు చంద నవీన్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద బాధితులు పురుగుల మందు డబ్బాలు పట్టుకుని కుటుంబ సభ్యులతో నిరసనకు దిగారు.
కాజీపేట కూరగాయ మార్కెట్ వద్ద కిరాణం షాపు నిర్వహిస్తున్న తమకు వరంగల్లో లక్ష్మీనారాయణ అనాజ్ కిరాణం హోల్సేల్ వ్యాపారి గుండా రఘురాం వద్ద కిరాణ సామాన్లు తీసుకుంటామని నవీన్ తెలిపారు. అలా పరిచయమైన రఘురాం అప్పుల్లో ఉన్న తన ఇల్లును మార్టిగేజ్ లోన్ ఇప్పిస్తానని చెప్పి ఏకంగా తన భార్య శ్వేత పేరుతో ఇల్లు, ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడని వాపోయారు.
రఘురాం, ఆయన భార్య శ్వేత తడిగుడ్డతో గొంతులు కోశారని వాపోయారు. తమకు బతకడం ఇష్టం లేదని, సామూహికంగా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వారు హైకోర్టు న్యాయమూర్తికి విన్నవించారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతున్న భార్యాభర్తలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.