ధర్మసాగర్ : ఎరువుల కంపెనీల అన్యాయ విధానాలపై తెలంగాణ ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. లింకు ప్రొడక్ట్స్ లేకుండా ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల వ్యాప్తంగా బంద్ ప్రకటించారు. ఈ మేరకు మండల కేంద్రంలో డీలర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలతో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎరువుల ఉత్పత్తిదారులు సరఫరాపై ఎఫ్ఓఎల్ ( ఫ్రైట్ ఆన్ లయబిలిటి) రవాణా ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డీలర్ల పై లింక్ ప్రొడక్ట్స్ బలవంతాన్ని నిలిపివేయాలని కోరారు. రైతులకు అవసరం లేని సరుకులను బలవంతంగా రుద్దడం దోపిడీకి సమానమన్నారు. డీలర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో తీవ్రమైన ఆందోళనలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీలర్ల మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.