ఏటూరునాగారం, ఆగస్టు 8 : వానకాలం.. వ్యాధుల కాలం. సీజనల్ వ్యాధులు విజృంభించే కాలం. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ప్రాణాలు హరీమనే కాలం. దోమలు, ఈగల వ్యాప్తి, పారిశుధ్య నిర్వహణ సరిగ్గాలేకపోవడం వంటి కారణాలతో ప్రజలు మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్తో అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కువ. ఇక్కడి ప్రజలకు సీజనల్ వ్యాధుల ప్రభావం, వాటి నివారణపై అవగాహన తక్కువ. అయితే, వీటిని అరికట్టేందుకు ఏటా వానకాలం ప్రారంభంలో చేపట్టే దోమల మందు పిచికారీ ఈ సారి లేనట్లుగానే కనిపిస్తున్నది. ఏజెన్సీలో దోమల బెడద ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ చేసేందుకు గతేడాది అధికారులు కొన్ని హైరిస్క్ గ్రామాలను ఎంపిక చేశారు.
వాటిలో ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లోని పేరూరు, రొయ్యూరు, మంగపేట, కన్నాయిగూడెం, చుంచుపల్లి, కొడిశాల, తాడ్వాయి, వాజేడు, బ్రాహ్మణపల్లి, ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 36 సబ్సెంటర్లలో 169 గ్రామాలు హై రిస్క్ గ్రామాలుగా గుర్తించారు. 169 గ్రామాల్లో 19812 ఇండ్లల్లో రెండు విడుతల్ల్లో దోమల మందు పిచికారీ చేయాలని మలేరియా విభాగం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదించారు. కానీ, వర్షాలు ప్రారంభమై దోమలు వ్యాప్తి చెందుతున్నా నేటికీ దోమల పిచికారీ ప్రారంభించలేదు. ఆగస్టు రెండో వారం సమీపిస్తున్నా దోమల మందు ఒకసారి కూడా పిచికారీ చేయలేదు. దీంతో గ్రామాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. జ్వరాలతో జనం మంచం పడుతున్నారు.
జూన్, జూలై నెలల్లోనే మొదటిసారి పిచికారీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు నిధులు కేటాయించకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగనట్లు తెలుస్తున్నది. హైరిస్క్ గ్రామాల్లో పిచికారీ కోసం 1328 కిలోల అల్ఫాసైపర్ మైత్రిన్ అవసరం. దీని ద్వారా కూలీలకు 1570 పని దినాలు కూడా కల్పించడం జరుగుతున్నది. గతేడాది దోమల మందు పిచికారీ చేసినా బడ్జెట్ కేటాయించకపోవడంతో చెల్లింపులు జరగనట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఇందుకోసం నిధులు కేటాయించకపోవడం వల్లనే పిచికారీ చేపట్టనట్లు తెలుస్తున్నది. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంలో భాగంగా బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నివారణ మందుకు పిచికారీ అత్యంత ప్రాముఖ్యమైనా సర్కారు పట్టించుకోవడం లేదని ఏజెన్సీ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కాగా, గతేడాది చెల్లింపులు జరగకపోవడం, ఈసారి నిధులు రాకపోవడంతో దోమల మందు పిచికారీ ప్రక్రియ ముందుకుసాగడం లేదని మలేరియా అధికారి ఒకరు తెలిపారు. అయితే నిధులు మంజూరు కోసం వేచి ఉన్నట్లు పేర్కొంటున్నారు.