హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 5: రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. సైబర్ నేరస్థులు ప్రధానంగా భయం, ఆశ, అత్యవసరత అనే మూడు భావోద్వేగాలను ఉపయోగించి మోసాలకు పాల్పడతారని, అలాంటి సందేశాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ధృవీకరించి నిర్ణయం తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. జాతీయస్థాయి సైబర్ జాగ్రూకత దివస్ కార్యక్రమం, సురక్షా కా తిరంగా -మంత్ ఎండ్ ఛాంపియన్ కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో, వరంగల్ పోలీస్ కమిషనరేట్ సంయుక్తంగా బుధవారం బోస్ హాల్లో సైబర్ జాగ్రూకత దివస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, నిట్లో జరుగుతున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సైబర్ భద్రత పరిశోధనలను ఆమె అభినందించారు. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ సైబర్ భద్రతపై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరమని, సైబర్ నేరాల నివారణకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో నిట్ త్వరలో సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ నిర్వహించన్నట్లు చెప్పారు. కృత్రిమ మేధస్సు ఆధారిత సైబర్ భద్రత, డీప్ ఫేక్ గుర్తింపు వంటి రంగాల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్తో కలిసి పనిచేస్తామన్నారు. రిజిస్ట్రార్ సునీల్ మెహతా, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దారా కవిత, నిట్ పూర్వ విద్యార్థిని, సైబర్ మోసాల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 1930 జాతీయ సైబర్ హెల్ప్ లైన్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ వంటి సేవల గురించి వివరించారు.