ఖిలావరంగల్, ఫిబ్రవరి 04 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లా కార్యాలయాల ప్రాంగణంలోని డీపీఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్తో పాటు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ) ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. మీడియా సెంటర్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించి, ఎంసీఎంసీ సెల్ విధుల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో జరగనున్న నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ఎన్నికల ప్రచార ప్రకటనలకు సమయానుకూలంగా అనుమతులు మంజూరు చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో ప్రసారమయ్యే పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించే పోస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో మీడియా పాత్ర కీలకమని పేర్కొన్న కలెక్టర్, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు మీడియా ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డీపీఆర్వో ఆయుబ్ అలీ, ఆర్డీవో సుమా, డీపీవో కల్పన, అదనపు పీఆర్వో ప్రేమలత తదితర అధికారులు పాల్గొన్నారు.