ఖిలావరంగల్, మార్చి 25 : గృహ విద్యుత్ వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGREDCO) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గృహాల రూఫ్టాప్లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ఆకర్షణీయమైన సబ్సిడీలు అందిస్తున్నట్లు చెప్పారు. ఒక కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్కు రూ. 30 వేల వరకు, రెండు కిలోవాట్లకు రూ. 60 వేల వరకు, మూడు కిలోవాట్లు, అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి రూ. 78 వేల వరకు రాయితీ లభిస్తుందని వివరించారు. ఈ పథకం ద్వారా గృహ అవసరాలకు కావలసిన విద్యుత్ను స్వయంగా ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా, మిగిలిన విద్యుత్ను పవర్ గ్రిడ్కు అందజేసి అదనపు ఆదాయం పొందే అవకాశమూ ఉందన్నారు.
జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రచార వాహనాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే మహిళా సంఘాల ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈవో రాంరెడ్డి, టిజిరెడ్ కో జిల్లా మేనేజర్ రాజేందర్, ఫీల్డ్ ఆఫీసర్ నవీన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.