సూర్యాపేట : ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని, పాఠశాలల్లో కనీస వసతులు కల్పించలాని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వేకువజాము నుంచే బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్ బాబుతో పాటు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి సూర్యాపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ లు చేస్తున్నారని శోభన్ బాబు మండిపడ్డారు. ప్రశ్నించినా, నిలదీసినా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే వరకు నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తామన్నారు.