ఖిలావరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీపడిన గుండె స్వప్నిక వర్ధన్నపేట మున్సిపాలిటీ కమిషనర్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్ ఎన్నిక ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగి వాణి తిరుపెల్లి (కాంగ్రెస్ అభ్యర్థి) 13 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించారని, నిజానికి తాను ఎక్కువ ఓట్లు పొందానని ఆమె పేర్కొన్నారు. స్వప్నిక తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 30 రోజుల్లో ఎలక్షన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది.
ఈ క్రమంలో ఫలితాలు, లెక్కింపు పత్రాల కోసం 19 ఫిబ్రవరి 2026న మున్సిపాలిటీ కమిషనర్కు ఆర్టీఐ దరఖాస్తు చేసినా, అది ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో తన హక్కు కోల్పోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బలవంతంగా సమాచారం దాచాలనే ఉద్దేశంతోనే కమిషనర్ ఆలస్యం చేస్తున్నారని ఎన్నిసార్లు అడిగినా సమాధానం రావడం లేదని ఆరోపించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు ఎన్నికల్లో మొదట బీఆర్ఎస్ అభ్యర్థి 7 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించగా, రీకౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి వాణీ 13 ఓట్ల మెజారిటీతో విజేతగా ప్రకటించారు. లెక్కింపు సిబ్బంది, రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) అక్రమాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టారు.