పోచమ్మమైదాన్, జూన్ 13: నేటి టెక్నాలజీ యుగంలో యువత సినిమాలు, టీవీలకే పరిమితమవుతున్నారని, సంక్షిప్తమైన ఇతివృత్తంతో కూడిన నాటకాలను సమాజ మార్పు కోసం ఆదరించాలని రిటైర్డు ప్రిన్సిపాల్, ప్రముఖ రచయిత బన్నా అయిలయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఎఫ్డీసీ, ఐక్యవేదిక పరపతి సంఘం సౌజన్యంతో వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక 16వ ఉభయ రాష్ట్రాల స్థాయి ఆహ్వాన తెలుగు నాటిక పోటీలు వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో అట్టహాసంగా శుక్రవారం రాత్రి ఆరంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..సమాజానికి మంచి చెబుతున్న నాటకాలను అందరూ ఆదరించాలని అన్నారు.
జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సాంస్కృతిక, నాటక ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ప్రముఖ కవి గిరిజామనోహర్, రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, వరంగల్ జిల్లా నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు మాడిశెట్టి రమేశ్, ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర కాజీపేట తిరుమలయ్య , ఆత్మీయ అతిథి డాక్టర్ బండారు ఉమామహేశ్వర్రావు, నాగపురి సంజయ్బాబు, గడ్డం యుగంధర్ పాల్గొన్నారు.
అట్టహాసంగా ఆరంభమైన జాతీయస్థాయి నాటిక పోటీలు..
కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం కాకతీయ నృత్య కళాక్షేత్రం డాక్టర వెంపటి శ్రావణి శిష్య బృందంతో స్వాగత నృత్యం, శాస్త్రీయ నృత్య ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా మొదటి నాటిక చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్స్ వారిచే రవీందర్బాబు రచన, దర్శకత్వంలో మా ఇంట్లో మాహాభారతం నాటికను ప్రదర్శించారు. ఇందులో సమాజంలోని ప్రతిఇంటిలో నెలకొన్న సమస్యల ఇతివృత్తాన్ని వివరిస్తూ ప్రదర్శించారు.
రెండవ నాటికగా నిజామాబాద్ తన్మయ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో చదువు నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఎన్ఎస్ఆర్ మూర్తి, వేముల ప్రభాకర్, జేఎన్ శర్మ, ఆకుతోట లక్ష్మణ్, సాధుల సురేష్, బీటవరం శ్రీధరస్వామి, కుసుమ సుధాకర్, కుడికాల జనార్దన్, మాలి విజయ్రాజ్, జూలురు నాగరాజు, సీత వెంకటేశ్వర్లు, షఫీ, జక్కోజు సత్యనారాయణ పాల్గొన్నారు.