నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 6 ; పగలనక, రాత్రనకా కష్టించిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట చేతికొచ్చే వేళ చెడగొట్టు ‘మిగ్జాం’ తుఫాన్తో అంతా తుడిచిపెట్టుకుపోయింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వరి, మిర్చి, మక్కజొన్న, పత్తి చేలు నీట మునగగా, పలుచోట్ల కల్లాలను వరద నీరు ముంచెత్తింది. వర్షానికి తడవకుండా వేసిన టార్పాలిన్ షీట్లు, పరదాలు గాలికి కొట్టుకుపోవడంతో ధాన్యంలో నీరు నిలిచింది. కల్లాల్లో వడ్లను ఆరబెడుతున్న రైతులు వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చలిగాలులు తోడవడంతో ప్రజలు ఇళ్లలోంచి రావడానికి ఇబ్బంది పడుతున్నారు.
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే వేళ నీటిపాలైంది. కోతకు వచ్చిన వరి, కల్లాల్లో ఉన్న ధాన్యంతో పాటు మిర్చి చేన్లను అకాల వర్షం ముంచెత్తింది. మిగ్జాం ప్రభావంతో బుధవారం ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినగా ములుగు, మానుకోట జిల్లాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. ముసురుకు తోడు చల్లని ఈదురుగాలులు వీస్తుండడంతో వణుకు మొదలైంది. వర్షానికి పలుచోట్ల వాగుల్లోకి వరద వచ్చి చేరుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారయంత్రాంగం సూచనలు చేస్తోంది. – నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 6
మిగ్జాం తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం, ఈదురుగాలులతో ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగింది.
వరి, మిర్చి, మక్కజొన్న, పత్తి పంటలు నీట మునగడం, మొక్కలు వాలిపోవడం సహా ధాన్యం తడిసిముద్దవడంతో అన్నదాత ఆగమయ్యాడు. వరి పంటలు చేతికి వచ్చే సమయంలో కురిసిన వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో వరి పంటలు నీటి పాలయ్యాయి. ములుగు జిల్లాలో గోదావరి తీర ప్రాంతాల వెంబడి ఉన్న మండలాల్లో రైతులు ఎక్కువగా మిర్చి పంట సాగు చేయగా అవి వరద ప్రభావానికి నీట మునిగాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. చాలాచోట్ల వరి మెదలు తడిసి ముద్దయ్యాయి. వరికోత కోసి కల్లాల్లో వడ్లను ఆరబెడుతున్న రైతులు వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వర్షానికి తడవకుండా వేసిన టార్పాలిన్ షీట్లు, పరదాలు కప్పినప్పటికీ గాలికి అవి కొట్టుకుపోవడంతో ధాన్యంలో నీరు నిలిచింది. ఏటూరునాగారం మండలంలో కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు నడుము లోతు వాగులో నుంచి నడుచుకుంటూ దాటి పాఠశాలలకు చేరుకున్నారు. తుఫాన్ ప్రభావంతో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసి రక్షణ చర్యలను చేపట్టింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం వర్షానికి తడువకుండా కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, నర్సింహులపేట, చిన్నగూడూరు, బయ్యారం, కురవి, డోర్నకల్, నెల్లికుదురు, దంతాలపల్లి, గార్ల మండలాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగింది.
వర్షానికి గార్ల మండలంలోని రాంపురం పాకాల ఏటి వద్ద వరద ఉధృతిని ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ బుధవారం పరిశీలించి గార్ల, రాంపురం, మద్దివంచ, కొత్తతండా సహా చుట్టు పక్క గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిపివేయాలని పోలీసు అధికారులను సూచించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగుకుండా తక్షణం స్పందించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. గడిచిన 24గంటల్లో ములుగు జిల్లాలో 57 మిల్లిమీటర్ల్ల వర్షపాతం నమోదు కాగా వెంకటాపురం మండలంలో అత్యధికంగా 71 మి.మీ వర్షం కురిసింది. అలాగే మహబూబాబాద్లో 49.6 మి.మీ, వరంగల్ జిల్లాలో 24.04 మి.మీ., భూపాలపల్లి జిల్లాలో 9.3 మి.మీ., హనుమకొండ జిల్లాలో 9.3 మి.మీ సగటు వర్షపాతం నమోదు కాగా ఆత్మకూర్ మండలంలో అత్యధికంగా 17.4 మిల్లీమీటర్లు వర్షం పడింది. దీనికి తోడు చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.