కందనూలు, కల్వకుర్తి గడ్డ.. గులాబీ పార్టీకి అడ్డాగా మారాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అభివృద్ధిని పరుగులు పెట్టించగా.. సంక్షేమ సౌరభాలతో బీఆర్ఎస్ గెలుపు నల్లేరుమీద నడకే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రచారంలో గులాబీ దండు దూసుకెళ్తుండగా.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కారెక్కుతున్నారు. దీంతో కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయి. గతంలో రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నాగర్కర్నూల్, విలక్షణ తీర్పునిచ్చే వారిగా కల్వకుర్తి నియోజకవర్గ ఓటర్లకు గుర్తింపు ఉన్నది. 1989 ఎన్నికల్లో టీడీపీ అధినేత ఎన్టీఆర్ను సైతం ఓడించి చరిత్రలోకి ఎక్కగా.. సూదినిజైపాల్రెడ్డి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నదీ ఇక్కడే.. ఇప్పటి వరకు నియోజకవర్గంలో మొత్తం 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరుగగా 9 పర్యాయాలు కాంగ్రెస్, మూడు సార్లు స్వతంత్రులు, రెండు సార్లు జనతాపార్టీ, రెండు సార్లు టీడీపీ, ఒకసారి బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఇక్కడి ప్రజల మదిలో కేవలం అభివృద్ధి మాత్రమే కనబడుతున్నది. అలాగే కందనూలులో రాజకీయ స్థిరత్వానికి ప్రజలు పట్టం కడుతున్నారు. గతం నుంచీ జరుగుతున్న ఎన్నికల ఫలితాలు ఇదే అంశాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్రెడ్డిని ఆరుసార్లు గెలిపించిన ప్రజలు, మూడుసార్లు వీఎన్గౌడ్ను.. వరుసగా రెండుసార్లు గులాబీ అభ్యర్థి ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి విజయమే నిదర్శనం. దీంతో మరోసారి కూడా ఓటర్లు ఇదే తీర్పు ఇవ్వబోయే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కల్వకుర్తి, నవంబర్ 1 : కల్వకుర్తి నియోజకవర్గంలో గులాబీ పార్టీ క్రమంగా పుంచుకుంటున్న ది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ నియోజకవర్గ అభివృద్ధికి శయాశక్తులా కృషి చేస్తున్నారు. అభివృద్ధి, సం క్షేమం పరుగులు పెడుతుండడంతో ప్రజలంతా బీఆర్ఎస్వైపు చూస్తున్నారు. 1952లో కల్వకుర్తి నియోజకవర్గం ఏర్పాటయ్యింది. 1952 నుంచి 1962 వరకు రెండు పర్యాయాలు జనరల్, ఎస్సీ రిజర్వుడు ద్విసభా నియోజకవర్గంగా ఉంది. 1952, 1957లో ద్విసభా నియోజకవర్గంలో భాగంగా ఎన్నికలు జరిగాయి. 1952 నుంచి 2018 వరకు నియోజకవర్గంలో 17సార్లు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలు జరిగాయి. మూడు పర్యాయాలు స్వతంత్రులు విజయం సాధించడం చరిత్రగా ఉంది. కాంగ్రెస్, టీడీపీ హవా సాగుతున్న సమయంలో కూడా ఇక్కడి ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులనే ఆదరించారు.
కల్వకుర్తి నియోజకవర్గం ప్రస్తుతం రెండు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. నాగర్కర్నూల్ జిల్లాల్లో మూడు మండలాలు, రంగారెడ్డి జిల్లాలో 4 మండలాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి ఉన్నది. 1952లో నియోజకవర్గం ఏర్పడగా, ప్రజలు ఇచ్చిన తీర్పులు పార్టీల గుర్తుల కంటే వ్యక్తిగతాన్ని చూసి ఓటేశారనే విషయం స్పష్టం చేస్తున్నాయి. 2009 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం 7మండలాలతో ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో కల్వకుర్తి ముఖచిత్రం మారిపోయింది. నియోజకవర్గంలో భాగంగా ఉన్న వంగూర్ మండలాన్ని అచ్చంపేట నియోజవర్గంలో, మిడ్జిల్ మండలాన్ని జడ్చర్ల నియోజకవర్గంలో విలీనం చేశారు. అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న కల్వకుర్తి మండలంలోని గ్రామాలను తిరిగి కల్వకుర్తి నియోజకవర్గంలో చేర్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల నుంచి కొన్ని గ్రామాలను తీసుకుని కొత్తగా కడ్తాల్ మండలాన్ని ఏర్పాటు చేశారు. ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపారు. అదేవిధంగా వెల్దండ మండలంలోని కొన్ని గ్రామాలను అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూర్ మండలంలో. కొన్ని గ్రామాలతో చారకొండ మండలాన్ని ఏర్పాటు చేశారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రసుత్తం 2.30,650 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,17,393 మంది పురుషులు, 1,13,250 మంది స్త్రీలు, ఇతరులు 7గురు ఉన్నారు. వీరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏడు మండలాల పరిధిలో 262 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు.
కల్వకుర్తి నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రాజకీయ చైతన్యానికి ఈ నియోజకవర్గాన్ని పుట్టిల్లుగా చెబుతారు. ఈ నియోజవర్గానికి తూర్పు దిక్కులో నల్గొండ, ఉత్తరం దిశలో రంగారెడ్డి జిల్లా, పరమడ దిశలో మహబూబ్నగర్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన లట్టుపల్లి వెంకట్రెడ్డి బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గంలో, 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన జక్కుల చిత్తరంజన్దాస్, కోట్ల విజయభాస్కర్రెడ్డి మంత్రి వర్గంలో మంత్రులుగా పనిచేశారు.
1989లో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చిత్తరంజన్దాస్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామరావును 3,568 ఓట్ల తేడాతో ఓడించారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత సూదిని జైపాల్రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి
17సార్లు జరిగిన ఎన్నికల్లో వరుసగా 4సార్లు సూదిని జైపాల్రెడ్డి విజయం సాధిస్తే, 2సార్లు చిత్తరంజన్దాస్ విజయం సాధించారు. హైదరాబాద్కు కల్వకుర్తి 90 కిలోమీటర్లలోపు ఉండటం వల్ల విద్యా, ఉపాధి కోసం 20శాతం వరకు హైదరాబాద్లో నివసిస్తుంటారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుర్తి నియోజకవర్గ రూపురేఖలు పూర్తి స్థాయిలో మారిపోయాయి. రాష్ట్ర రాజధానికి కల్వకుర్తి నియోజకవర్గం దగ్గరగా ఉన్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. రియల్ ఎస్టేట్ ఊపందుకోవడంతో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగిపోయాయి. కల్వకుర్తి ఎత్తపోతల ద్వారా దాదాపు 70వేల ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగునీరు అందుతుండటంతో వ్యవసాయం చాలా బలోపేతంగా మారింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు అమాంతం పెరగడంతో కల్వకుర్తి నియోజకవర్గం మొత్తం నాగరీకరణగా వైపు పరుగులు పెడుతున్నది. నియోజకవర్గం నుంచి మూడు జాతీయ రహదారులు వెళ్తుండటంతో పెరిగిన రవాణా సౌకర్యాలతో కల్వకుర్తి కొత్త సోగసులు అద్దుకున్నది. తెలంగాణ రాష్ట్రం రావడం, బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాతనే గణనీయమైన అభివృద్ధి సాధించడంతో నియోజకవర్గ వాసులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో..ఇప్పుడు అంతకు రెట్టింపు స్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉంది. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో వస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగవ సారి గెలుపుకోసం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఉవ్విళూరుతున్నారు. కడ్తాల్ మండలం చల్లంపల్లికి చెందిన జైపాల్యాదవ్ ఇప్పటికీ కల్వకుర్తి నుంచి 3సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన జైపాల్యాదవ్ను మరోసారి బీఆర్ఎస్ పార్టీ బరిలో దింపి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు కంటి మీద కునుకులేకుండా చేసింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు తోడు బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి తోడు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకగా మారనున్నది. 2018లో బీఆర్ఎస్ ను ంచి గెలుపొందిన ఎమ్మెల్యే జైపాల్యాదవ్ బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో చేపట్టిన అభివృద్ధి పనులు ఆయన గెలుపుకు సోపానాలుగా మారనున్నాయి. మిషన్ భగీరథతో తాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు మరమ్మతు, కృష్టా సాగునీరు, తండాలకు నూతన గామ పంచాయితీలు, బీటీ రోడ్లు, ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం, కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ఆర్థిక సమృద్ధి సాధించిన కల్వకుర్తివాసులు బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామనే చెబుతున్నారు.