మహబూబాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో 85 ఏళ్లు వయసు పైబడిన వారితో పాటు దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఎన్నికల సంఘం కల్పించింది. మే 13న మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పార్లమెంటు పరిధిలో ఉండే వృద్ధులతో పాటు దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటు వేయవచ్చు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో 85 ఏళ్లు దాటిన వృద్ధులు 10,724 మంది ఉండగా, 33,56 దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఇంటి నుంచి ఓటు వేయాలనుకునే వారి నుంచి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణను అధికారులు ప్రారంభించారు. అర్హులైన వారు వచ్చే నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటి వద్ద ఓటు వేయాలనుకునే వారు ఫారం-డీ నింపి ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులు గ్రామపంచాయతీ కార్యదర్శి, బూతు లెవల్ అధికారి(బీఎల్వో) వద్ద అందుబాటులో ఉన్నాయి. మహబూబాబాద్ పార్లమెంట్కు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన నాలుగు రోజుల తర్వాత హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలింగ్ సిబ్బంది స్వయంగా ఇంటికి వచ్చి ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల వివరాలను ఎన్నికల అధికారులు ఇప్పటికే గుర్తించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దివ్యాంగుల ఓట్లు ఇలా ఉన్నాయి. డోర్నకల్ 6,364, మహబూబాబాద్ 7,178, నర్సంపేట 6,075, ములుగు 4,291, పినపాక 3,695, ఇల్లందు 3,510, భద్రాచలం 2393 కలిపి మొత్తం 33,506 ఓట్లు ఉన్నాయి.