న్యూ శాయంపేట, నవంబర్ 25 : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్కు అండగా నిలువాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కోరారు. నగరంలోని న్యూ శాయంపేటలో శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను జన్మించింది వడ్డేపల్లి ప్రాంతంలో అని, రాజకీయ పునర్జన్మ శాయంపేట ఇచ్చిందన్నారు. నాడు తన అన్న ప్రణయ్భాస్కర్ను, నేడు తనను తమ బిడ్డగా ఆదరించి ఆశీర్వదిస్తున్నారన్నారు. శాయంపేట ప్రజలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. శాయంపేట తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏట్లుండే.. ఇప్పుడు రూ.వంద కోట్లతో అభివృద్ధి చేస్తే ఎట్లా మారిందో ప్రజలే గమనించాలన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో, కరోనా, వరదల సమయంలో కనిపించని రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాళ్లను వాడల్లో తిరుగనియ్యకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలేదని అన్నారు. 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, డివిజన్ ఎన్నికల ఇన్చార్జి జోరిక రమేశ్, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి అరుణ-శివశంకర్, వేల్పుల మోహన్రావు, డివిజన్ బాధ్యుడు జానకి రాములు, అధ్యక్షుడు ఆలకుంట వెంకన్న, వెల్పుల వేణు, రాజేశ్వరి ఆటో యూనియన్ అధ్యక్షుడు సాంబమూర్తి పాల్గొన్నారు.
హనుమకొండ సిటీ/హనుమకొండ : ఎవరికి ఆపద వచ్చినా కుటుంబ సభ్యుడిలా అండగా ఉండేటోన్ని కాపాడుకోవాలని దాస్యం అన్నారు. శనివారం రాత్రి 4 డివిజన్తో పాటు 30 డివిజన్ బాలసముద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్దమ్మగడ్డ చర్చిలో ప్రార్థనలు చేశారు. డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్, కార్పొరేటర్ బొంగు అశోక్, నాయకులు నిరంజన్, రఘు, శ్యాంసుందర్, వీర రఘువీర్, మనోహర్, వేణు, పార్వతి, సునీత, జ్యోతి పాల్గొన్నారు.