జఫర్గఢ్, నవంబర్ 6: ఈ ఎన్నికల్లో తనను నిండుమనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఐదేళ్లు ప్రజలకు సేవలందిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని ఒబులాపూర్, ముగ్ధుంతండా, తమ్మడపల్లి(జీ), తిమ్మాపూర్, హిమ్మత్నగర్, సూరారం, తీగారం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాలకు ముఖ్య అతిథిగా కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, ఆయా గ్రామాల ప్రజలు డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశాల్లో కడియం శ్రీహరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనను స్టేషన్ ఘన్ఫూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని, ప్రజలు ఆశీర్వదిస్తే నిజాయితీగా, అవినీతికి తావులేకుండా ప్రజాసేవ చేస్తానన్నారు. 1994, 1999, 2008లో ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించానని తెలిపారు. 2014లో ఎంపీగా, అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించి సీఎం కేసీఆర్ సారథ్యంలో సేవలందించానన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని పేర్కొన్నారు.
అర చేతిలో వైకుంఠం చూపుతూ అబద్ధాలతో మాయమాటలు చెబుతున్న కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కడియం శ్రీహరి ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చినపుడు వారు పాలించే రాష్ర్టాల్లో అమలయ్యే సంక్షేమ పథకాలపై నిలదీయాలని సూచించారు. కాంగ్రెస్ పాలించే కర్ణాటక రాష్ట్రంలో అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ వ్యవసాయానికి 5 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రకటించి వారి అసమర్ధ పాలనను నిరూపించుకున్నారని తెలిపారు. టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వద్దు.. మూడు గంటలు చాలని చెప్పిన మాటలను కడియం శ్రీహరి ప్రజలకు గుర్తు చేశారు. రైతులు సుభిక్షంగా ఉండాలంటే కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
మండలంలోని తమ్మడపల్లి(జీ)లో కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు. సర్పంచ్ అన్నెపు పద్మాఅశోక్ దంపతులు సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన 200 గజాల స్థలాన్ని గౌడ కమ్యూనిటీ హాలుకు విరాళంగా అందించారు. కార్యక్రమాల్లో స్టేషన్ ఘన్ఫూర్ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, పెద్దిరెడ్డి పాల్గొన్నారు.