హనుమకొండ చౌరస్తా, జూన్ 6: కాంట్రాక్టర్ల పెం డింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) వైస్ ప్రెసిడెంట్ వేము ల సత్యమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బిల్లులు చెల్లించకుండా రేవంత్రెడ్డి సర్కారు కాలయాపన చేస్తోందని, రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1941లో,భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే స్థాపించబడిన దేశంలోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక నిర్మాణ రంగ సంస్థల్లో ఒకటని పేర్కొన్నారు. 85 సంవత్సరాలుగా నిర్మాణ రంగ అభివృద్ధికి, కాంట్రాక్టర్ల హక్కుల పరిరక్షణకు, దేశమౌలిక సదుపాయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నదన్నారు.
డ్రెయినేజీ నుంచి డ్యా మ్ల నిర్మాణం వరకూ వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లు లు చెల్లించడం లేదన్నారు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని సత్యమూర్తి తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, బడ్జెట్కు అనుగుణంగా ప్రాధాన్యత గల పనులను కొనసాగించాలని సూచించారు. ప్రాధాన్యం లేని పనులను నిలిపివేసి, కాంట్రాక్టర్ల డిపాజిట్లు తిరిగి చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా జాప్యం చేస్తున్నదన్నారు. ముం దుగా పనులు పూర్తి చేసి ఏళ్లుగా బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘ముందు వచ్చిన బిల్లుకు ముందు చెల్లింపు’ అనే సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం ఒక ఉపసంఘాన్ని ఏ ర్పాటు చేయగా కాంట్రాక్టర్ల సంఘం పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు.
బిల్లుల చెల్లింపులో ఆలస్యం కారణంగా అనేక మంది కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని సత్యమూర్తి తెలిపారు. వీరిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు గుండెపోటుకు గురైన ఉదంతాలను వివరించారు. ఈ పరిస్థితి నిర్మాణ రంగం భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. కాంట్రాక్టర్లు మాత్రమే కాకుండా, కాంట్రాక్ట్ పనులపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉద్యోగులు, ఇంజినీర్లు, సూపర్వైజర్లు, అకౌంటెంట్లు, యంత్రాల ఆపరేటర్లు, డ్రైవర్లు, కార్మికులు నిర్మాణ సామగ్రి సరఫరాదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని తెలిపారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా వారి వేతనాలు, బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా కాంట్రాక్టర్ల కుటుంబాలతో పాటు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారు రోడ్డున పడేపరిస్థితి నెలకొందన్నారు. దీనికి శాశ్వత పరిషారం కోసం బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లతో ఈ నెల 18న ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తున్నందున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లో పనిచేస్తున్న ఆంధ్రా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు బిల్లు లు చెల్లిస్తున్నారని అసోసియేషన్ స్టేట్ మాజీ ఛైర్మ న్లు బీ సుగుణాకర్రావు, కటుకూరి దేవేందర్రెడ్డి, యూ సురేందర్ అన్నారు. సంవత్సరం క్రితం ధ ర్నా కూడా చేశామని అయినా ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదన్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని శాఖల్లో కలిపి సుమారు రూ.3 వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర సలహాదారు కే ప్రభాకర్రెడ్డి, జనగామ కేంద్ర మాజీ చైర్మన్ ఇమ్మడి దేవేందర్రెడ్డి, వరంగల్ కేంద్ర చైర్మన్ ఈ మనోజ్, జిల్లా నాయకులు ఎం ఐలయ్య, వీ రాజారెడ్డి, మున్సిపల్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.