గిర్మాజీపేట, సెప్టెంబర్ 19: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికే తాను మొదటి ప్రాధాన్యం ఇస్తున్నానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ‘ఇంటింటికీ మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన నియోజకవర్గంలోని 37వ డివిజన్ దళితకాలనీలో పర్యటించారు. ముందుగా ఖిలావరంగల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే, సమీపంలోని బొడ్రాయి(గ్రామదేవత) వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దళితకాలనీలోని ప్రతి గడపకు వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తాను ప్రభుత్వం ద్వారా ఏవిధంగా సహాయపడాలని అడిగారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.
సత్వర పరిష్కారానికి చర్యలు
‘మీ ఇంటికి మీ ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని రూపొందించి తూర్పు నియోజకవర్గంలోని ప్రతి గడపకూ వెళ్లి ప్రజల యోగక్షేమాలు, ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు, ప్రభుత్వపరంగా చేయూతనందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. తన దృష్టికొచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు నన్నపునేని తెలిపారు. ఓర్వలేని, మతిలేని కొందరు నాయకులు తనది ఎన్నికల ప్రచారంగా భావిస్తున్నారని, ఎన్నికల ప్రచారమే అయితే అప్పటికప్పుడు అధికారులతో కలిసి సమస్యలను ఎలా పరిష్కరిస్తామని ప్రశ్నించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ సహకారంతో రూ. 4,100 కోట్లతో వరంగల్ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ భవన సముదాయం, నూతన బస్ స్టేషన్, 24 అంతస్తుల భవనంతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన, ఇంటిగ్రేటెడ్ మార్కెట్.. ఇలా తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఇదంతా ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనపడుతున్నదని, కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, వాళ్లకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ప్రణాళికాబద్ధంగా ముందుకు..
తాము ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని, దళితబంధు, బీసీ, మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సాయం వంటి ఎన్నో పథకాలను నియోజకవర్గంలోని అర్హులకు అందించామని, ఇంకా అందిస్తూనే ఉంటామని, తామంతా ప్రజల వెంటే ఉండి సకల సౌకర్యాలు సమకూర్చుతామని ఎమ్మెల్యే నన్నపునేని స్పష్టం చేశారు. తాను వ్యక్తిగతంగా 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడి స్థితిగతులు తెలిసి వరంగల్ నగరాన్ని కనీవినీఎరుగని రీతిలో అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో పని చేస్తున్నట్లు వివరించారు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా నిరుపేదల అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే తన ధ్యేయమన్నారు. కాగా, నన్నపునేని పర్యటనలో నిలువ నీడలేని ఓ వృద్ధురాలిని చూసి చలించిన ఎమ్మెల్యే గృహలక్ష్మీ పథకంలో ఇల్లు మంజూరు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ భోగి సువర్ణ, బీఆర్ఎస్ నేత భోగి సురేశ్, డివిజన్ అధ్యక్షుడు సంగరబోయిన విజయ్, డివిజన్ యూత్ నాయకులు, మహిళా నాయకులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
ప్రజలు ఆయురారోగ్యాలతో బాగుండాలి
గిర్మాజీపేట/కాశీబుగ్గ: విఘ్నాల అధిపతుడు విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో బాగుండాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం శివనగర్లోని ఎమ్మెల్యే నరేందర్ తన క్యాంపు కార్యాలయంలో కుటుంబ సమేతంగా ఆదిదేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయకుడి చల్లని చూపు రాష్ట్రం, నియోజకవర్గంపై ఉండాలని, ఏకదంతుడి ఆశీస్సులతో తూర్పును మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంతో రాష్ట్రం, నియోజకవర్గం మరింత ప్రగతిపథంలో వేగంగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేందర్ సతీమణి వాణి, కుమారులు లోకేశ్, మన్ప్రీత్ పటేల్ పాల్గొన్నారు. అలాగే, 19వ డివిజన్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయలో నన్నపునేని నరేందర్, వాణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా ఓసిటీ క్లబ్హౌస్లో జరిగిన గణేశ్ నవరాత్రోత్సవాల్లో వారు పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేవారు.