ములుగు, జూలై 8(నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాధన స్ఫూర్తితో గిరిజన యూనివర్సిటీని సాధిస్తామని ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని ఎంపీ కవిత పేర్కొన్నారు. శనివారం ములుగులోని గాంధీ చౌక్ వద్ద మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్ నిరాహార దీక్ష తలపెట్టగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, ములుగు జడ్పీ అధ్యక్షురాలు బడే నాగజ్యోతి హాజరై సంఘీభావం తెలిపారు. విభజన హామీలు నెరవేర్చాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ తెలంగాణపై కేంద్రం చిన్నచూపే చూస్తున్నదని.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అన్ని రాష్ర్టాల ఎంపీలను ఏకం చేసి కేంద్రం మెడలు వంచి గిరిజన వర్సిటీని సాధించుకుంటామని వారు స్పష్టంచేశారు.
14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి ఏ విధంగానైతే తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నామో అదే స్ఫూర్తితో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతామని మానుకోట ఎంపీ మాలోత్ కవిత అన్నారు. శనివారం ములుగు జిల్లాకేంద్రంలో మానుకోట మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరాహార దీక్ష చేపట్టగా ఎంపీ కవిత, నర్సంపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీచైర్పర్సన్ బడే నాగజ్యోతి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైనప్పటి నుంచి ప్రతీ పార్లమెంట్ సమావేశంలో విభజన హామీల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నప్పటికీ కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై చిన్నచూపు ప్రదర్శిస్తున్నదని అన్నారు. దాటవేసే ధోరణి ప్రదర్శిస్తూ కుంటి సాకులు చెబుతూ విభజన హామీలను తుంగలో దొక్కిందన్నారు. రాష్ట్రం విడిపోయిన సమయం లో రెండు రాష్ర్టాలకు సంబంధించిన హామీలను పరిష్కరించాల్సిన కేంద్రం ఆంధ్ర ప్రదేశ్కు ఒక రీతిలో, తెలంగాణకు ఒక రీతిలో ప్రవర్తిస్తూ రాష్ట్ర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అవమానాలు జరిగేలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో పట్టుపట్టి కేంద్రం మెడలు వంచి గిరిజన యూనివర్సిటీ సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు సముచిత న్యాయం దక్కిందన్నారు. అన్ని రాష్ర్టాల పార్లమెంట్ సభ్యులను ఏకం చేసి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో గిరిజన యూనివర్సిటీని సాధించి తీరుతామని కవిత ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రం వెంటనే తేల్చాలి : జడ్పీచైర్పర్సన్ నాగజ్యోతి
ములుగుకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉందో లేదా అనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా కేంద్రం యూనివర్సిటీని ఏర్పాటుచేయకపోవడంలో ఆంతర్యమేమిటో బీజేపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఉదయం నిరాహార దీక్షను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది ప్రారంభించగా సాయంత్రం భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అందరికీ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కేయూ జాక్ ఉద్యమ నాయకుడు అమర్సింగ్, విష్ణు, రాజు, వెంకన్న, స్వామి, రాజేందర్, రమేశ్, ప్రశాంత్, రవీందర్నాయక్, ఓయూ విద్యార్థి నాయకులు రవిరాథోడ్, సేవాలాల్ సేనా నాయకులు సంతోష్నాయక్, రాహుల్నాయక్, గ్రంథాలయ చైర్మన్ గోవింద్నాయక్, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్, రమణారెడ్డి, సునీల్కుమార్, సమ్మయ్య, లక్ష్మీనారాయణ, వేణుయాదవ్, సూరయ్య, జడ్పీటీసీలు భవాని, హరిబాబు, రుద్రమదేవి, కోఆప్షన్ సభ్యురాలు వలియాబీ, ఎంపీపీలు శ్రీనివాస్రెడ్డి, విజయ, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయ్రాంనాయక్, పట్టణ అధ్యక్షుడు విజయ్, నాయకులు కోగిల మహేశ్, గజ్జి నగేశ్, ఇతర ప్రజాసంఘాల నాయకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ సీతారాంనాయక్
గిరిజన యూనివర్సిటీ కోసం ములుగు జిల్లాకేంద్రంలో 336 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించినప్పటికీ బీజేపీ నాయకులు అబద్ధాలు ఆడు తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ సీతారాంనాయక్ ధ్వజమెత్తారు. యూనివర్సిటీ స్థలాన్ని బీజేపీ నాయకుల స్మృతివనంగా ప్రకటించాలని ఎద్దేవా చేశారు. స్థలం ఇచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రి మరచిపోయి కేటాయించలేదనడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా మోదీ వెళ్లిపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నదని అన్నారు. వరంగల్ పర్యటనలో ప్రధాని మోదీ.. వన దేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మలను ప్రస్తావించినప్పటికీ మహా జాతరకు జాతీయ హోదా కల్పించే అంశంపై స్పందించకపోవడం గిరిజనులను అవమానపర్చినట్లుగా ఉందన్నారు. విభజన హామీలను నెరవేర్చాలని సీఎం కేసీఆర్తో పాటు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఢిల్లీ పీఠం కదిలిస్తాం : ఎమ్మెల్యే పెద్ది
కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి దశలవారీగా పోరాటాలు చేసి గిరిజన యూనివర్సిటీని సాధించేందుకు కృషిచేస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. అవసరమైతే గిరిజనులందరినీ ఏకం చేసి రైలులో తరలించి ఢిల్లీలో నిరసన కార్యక్రమాలకు చేపట్టేందుకు సైతం వెనుకాడమని స్పష్టంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరిత ధోరణిని అవలంబిస్తూ విభజన హామీలను అమలుచేయడం లేదన్నారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటైతే ఉమ్మడి వరంగల్ విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందే అవకాశం ఉందన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు ఇప్పటికైనా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణపై కేంద్రానిది వివక్షే : ఎమ్మెల్యే గండ్ర
ములుగులో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించినా కేంద్రం యూనివర్సిటీ ఏర్పాటు చేయకపోవడం తెలంగాణపై వివక్షకు నిదర్శనమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో మాజీ ఎంపీ సీతారాంనాయక్తో కలిసి పోరాటం ముమ్మరం చేసి యూనివర్సిటీ సాధిస్తామన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న ఘనత ప్రధాని మోదీదేనన్నారు. అబద్ధపు మాటలతో బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలను సంతృప్తి పర్చలేరని, మోదీ సభకు కేసీఆర్ రాలేదని, బీజేపీ నాయకులు అనడం సిగ్గుచేటన్నారు. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి కాబట్టే సీఎం కేసీఆర్ మోదీ సభకు హాజరు కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను తెలియజేశారని అన్నారు.