ఉమ్మడి రాష్ట్రంలో పట్టిన ‘దారి’ద్య్రం.. స్వపరిపాలనలో తొలగిపోయింది. మెరుగైన రవాణా వ్యవస్థతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్న స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో రూ. వేల కోట్ల నిధులు వెచ్చించి అద్దంలాంటి రోడ్లను అందుబాటులోకి తేవడమే కాదు.. వాటికి ఎప్పుటికప్పుడు మరమ్మతులు కూడా చేయిస్తున్నది. ప్రతి ఊరికీ మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నది. రెండేళ్లలోనే ఉమ్మడి జిల్లా పరిధిలోని రహదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్అండ్బీ ఆధ్వర్యంలో రూ.460 కోట్లు వెచ్చించి మరమ్మతులను పూర్తిచేయడంతో పాటు పలు ప్రాంతాల్లో విస్తరణ కూడా చేపట్టింది. మొత్తంగా 885 కిలోమీటర్లమేర 199 పనులు చేపట్టగా వాటిలో దాదాపు 70శాతం పూర్తయ్యాయి. మరికొన్ని పనులు చివరి దశలో ఉండగా ఇప్పుడు ఎటు చూసినా సడక్లు సూపర్గా కనిపిస్తున్నాయి.
ఏళ్ల తరబడి గతుకులు, అతుకుల దారులతో అష్టకష్టాలు పడ్డ రోజులకు రాష్ట్ర ప్రభుత్వం చరమగీతం పాడింది. ఉమ్మడి జిల్లాలో రోడ్లకు మహర్దశ పట్టించింది. కొత్త రోడ్లు వేయడమే కాకుండా వాటికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే మరమ్మతులు చేయిస్తున్నది. మెరుగైన రవాణా వ్యవస్థతో అత్యవసర వైద్య సేవలు, ఉన్నత చదువులు, వ్యాపార, వాణిజ్య, ఉపాధి రంగాలకు ఎంతో తోడ్పాటు లభిస్తున్నది.
Roads | వరంగల్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మన నిధులు మనకే’ అన్న ఉద్యమ నినాదం సాకారమై మన నిధులతో మన ప్రాంతంలో వసతులు మెరుగుపడుతున్నాయి. అభివృద్ధిలో అతి ముఖ్యమైన రోడ్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలోని అన్ని రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడమే కాకుండా పలు ప్రాంతాల్లో విస్తరణ కూడా చేపట్టింది. గత రెండేండ్లలో ప్రతి రోడ్డు మరమ్మతు పూర్తి చేసింది. కొన్ని కొత్త రోడ్లను నిర్మించి ఎప్పటికప్పుడు మరమ్మతులను చేయిస్తూ రవాణా సాఫీగా ఉండేలా చూస్తున్నది. జిల్లాకేంద్రాల్లో నాలుగు లైన్లు, మండలకేంద్రాల్లో డబుల్ రోడ్లు కచ్చితంగా ఉండేలా రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. కొత్త జిల్లాల్లోనూ ఇవే ప్రణాళికలు అమలు చేసింది. మండల కేంద్రాలను అనుసంధానం చేసే ప్రతి రోడ్డును విస్తరించి అభివృద్ధి చేసింది.
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో వేసిన రోడ్లు రెండేండ్లుగా మరమ్మతులకు రాగా పనులను వేగంగా పూర్తి చేసింది. అర్అండ్బీ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. దీనికి ముందు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కటే సర్కిల్ ఉండేది. ఈ సర్కిల్ పరిధిలో హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి-ములుగు జిల్లాలు డివిజన్లుగా ఉన్నాయి. వీటి పరిధిలోని అన్ని రోడ్ల మరమ్మతుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మరో నెలలో వంద శాతం పనులు పూర్తి కానున్నాయి.
రెండేళ్లు.. రూ.460కోట్లు
2021-22 ఆర్థిక సంవత్సరంలో వరంగల్ సర్కిల్ పరిధిలో 445 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతుల కోసం ఆర్అండ్బీ శాఖ రూ.159 కోట్లతో 69 పనులు పూర్తి చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆరు జిల్లాల పరిధిలోని 440 కిలో మీటర్ల రోడ్ల మరమ్మతుల కోసం రూ.236 కోట్లతో 93 పనులు చేపట్టింది. వీటిలో కొన్ని పనులు కొనసాగుతున్నాయి. రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి వరంగల్ సర్కిల్లో రూ.63.53 కోట్లతో 37 కల్వర్టులు, డ్యాముల పనులు మంజూరు కాగా, తుది దశకు చేరుకున్నాయి. మొత్తంగా రెండేండ్లలో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 885 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.460 కోట్లు వెచ్చించింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కువ జనాభా ఉండే వరంగల్ మహానగరంలోని రోడ్ల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 130 కిలో మీటర్ల రోడ్లు ఆర్అండ్బీ పరిధిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి హామీలు, ఆర్అండ్బీ శాఖ నిధులతో ఈ రోడ్లన్నింటికీ ఇటీవలే మరమ్మతులు పూర్తి చేశారు. ఇప్పుడు గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్లన్నీ సరికొత్తగా మారాయి.
వేగంగా రోడ్ల పనులు
రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు వే గంగా జరుగుతున్నా యి. ఎండకాలం కావడంతో ఇది పనులకు అనుకూలమైన సీజను. ఇప్పటికే అధిక శాతం పనులు పూర్తయ్యాయి. జూన్ లోపు వందశాతం పనులు పూర్తయ్యేలా అర్అండ్బీ శాఖ చర్యలు చేపట్టింది.
– నాగేందర్రావు, ఆర్అండ్బీ ఎస్ఈ