హనుమకొండ చౌరస్తా : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ అంతర్ జిల్లాల అండర్ -19 క్రికెట్ పోటీలు ( Cricket Tournament ) సోమవారం నుంచి వరంగల్ (Warangal) జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. వరంగల్, నిజామాబాద్( Nizamabad ) జట్ల మధ్య వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో వరంగల్ రంజీ ప్లేయర్ తోట సుకాంత్ పాల్గొని టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు.
తొలుత బ్యాటింగ్కు దిగిన నిజామాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకుగాను కేవలం 30.1 ఓవర్లు మాత్రమే ఎదుర్కొని 117 పరుగులకు చేసి ఆలౌటైంది. జట్టులో ఫన్నాన్ 30 పరుగులు తప్ప మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. వరంగల్ బౌలర్ పూజిత్ 6.1 ఓవర్లు వేసి 6 వికెట్లు తీసి నిజామాబాద్ జట్టును కట్టడి చేశాడు.118 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ జట్టు కేవలం 24.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది. వరంగల్ జట్టులో మణిదీప్సింగ్ 20 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి అజేయంగా రాణించాడు.

మొగిలిచర్ల క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో కరీంనగర్-ఆదిలాబాద్ జట్లు తలపడగా, కరీంనగర్ 158 భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన కరీంనగర్ జట్టు నిర్ణీత 45 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు సాధించింది. కరీంనగర్ జట్టులో తక్షిల్ 120 బంతులు ఎదుర్కొని 16 బౌండరీలు, 9 సిక్సర్లతో 188 పరుగులు చేశాడు.
మరో బ్యాట్స్ మన్ రుత్విక్ 144 బంతుల్లో 10 బౌండరీలు, ఒక సిక్సర్తో 94 పరుగులు సాధించాడు. 332 పరుగుల విజయలక్ష్యంలో సాధనలో తడబడిన ఆదిలాబాద్ 34 ఓవర్లలో ఎదుర్కొని 174 పరుగులకు ఆలౌటై 158 పరుగుల తేడాతో ఓటమి చెందింది. కార్యక్రమంలో వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ , జిల్లా మాజీ కార్యదర్శి ఉదయభానురావు, సభ్యులు బండారి ప్రభాకర్, మట్టెడ కుమారస్వామి, నిజామాబాద్ జాయింట్ సెక్రటరీ సురేష్ పాల్గొన్నారు.