కాజీపేట, జూ 4: రైలు పట్టాలపై పెద్ద బండ రాళ్లు పెట్టి రెండు రైళ్లు నిలిచిపోయేందుకు కారకులైన ఇద్దరు నిందితులను రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. రైల్వే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ చటర్జీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాజీపేట రైల్వే జంక్షన్-పెండ్యాల రైల్వేస్టేషన్లో మధ్యలోని మడికొండ శివారులో కిలోమీటర్ నెంబర్ 320 వద్ద ఈనెల 1వ తేదీన అప్, డౌన్ లైన్ లో రైలు పట్టాలపై ఇద్దరు వ్యక్తులు పెద్దపెద్ద బండరాలను పలుచోట్ల పెట్టారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ రైలు, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గరీబ్ రధ్ రైలు డ్రైవర్లు మడికొండ శివారులోని రైలు పట్టాలపై ఉన్న బండరాలను చాలా దూరం నుంచి గుర్తించి రైళ్లను నిలిపివేశారు.
రైల్వే డ్రైవర్లు అప్రమత్తంతో వందే భారత్, గరీబ్ రథ్, రైళ్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. విషయాన్ని రైల్వే అధికారులకు రైల్వే ఆల్ కంట్రోల్ మెసేజ్ చేశారన్నారు. రైల్వే ఉన్నతాధికార ఆదేశాలతో రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బంది విచారణ చేపట్టి ఇద్దరిని నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సంచన్ మార్కం (27), మహేశ్వర్ (25) ల బతుకుదెరువు కోసం మడికొండకు వచ్చారు. తాగిన మైకంలో రైలు పట్టాలపై బండరాళ్లు పెట్టినట్లు విచారణలో ఒప్పు కున్నారన్నారని వారు తెలిపారు.
అదేవిధంగా కాజీపేట రైల్వే జంక్షన్ – సికింద్రాబాద్ సెక్షన్ లోని స్టేషన్ ఘన్పూర్ – ఇప్గూడ రైల్వే స్టేషన్ మధ్య గత నెల 30వ తారీఖున గుర్తు తెలియని వ్యక్తి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న వందే భారత రైలు పై రాళ్లతో దాడి చేశారు. దీంతో వందే భారత్ రైలు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఈ ఘటనకు పాల్పడిన స్టేషన్ ఘన్పూర్ కు చెందిన వీ. బిక్షపతిని అరెస్టు చేశామని వివరించారు. ఎవరైనా అనుమతి లేకుండా రైల్వే పట్టాల వద్దకు అక్రమంగా వచ్చిన, రైల్వే పరిసరాలలో తిరిగిన, రైల్వే ఆస్తులకు నష్టం, దొంగతనానికి పాల్పడాలని ప్రయత్నించిన, రైల్వే ఆర్పీఎఫ్ యాక్ట్ ప్రకారంగా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.