పూర్తి పారదర్శకంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపడుతున్నదని, ప్రతిభ ఉన్నవారినే పక్కాగా ఎంపిక చేస్తున్నదని టీఎస్పీఎస్సీ ద్వారా కొలువులు సాధించినవారు స్పష్టం చేస్తున్నారు. 2016 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్లలో ఉద్యోగాలు పొంది వివిధ శాఖల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు, అధికారులు ‘నమస్తే’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎంపికలో తాము ఎక్కడా ఇబ్బందులు ఎదుర్కోలేదని, అవినీతి, అక్రమాలకు తావులేకుండానే టీఎస్పీఎస్పీ ద్వారా జాబ్లు వచ్చాయని చెబుతున్నారు. ఎవరో చేసిన తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదించడం సరికాదని సూచిస్తున్నారు. కొందరు చేసిన నిర్వాకాన్ని భూతద్దంలో చూపుతూ తప్పుడు ప్రచారాలు చేయడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిజాయితీగా నియామకాల ప్రక్రియ పూర్తి చేసినందునే తాము తమ కలలను నెరవేర్చుకున్నామని కుండబద్దలు కొడుతున్నారు. వీరిలో తమ టాలెంట్ ద్వారా రెండు, మూడు, కొందరు నాలుగు ఉద్యోగాలకు ఎంపికైనవారూ ఉన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 19
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నదని టీఎస్పీఎస్సీ ద్వారా వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందినవారు స్పష్టం చేస్తున్నారు. ప్రతిభ ఉన్నవారికే అవకాశాలు దక్కుతున్నాయని, ఎలాంటి పైరవీలకు తావులేదని చెబుతున్నారు. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ చేపట్టిన నియామకాల ద్వారా వేలాది మంది ఉద్యోగాలు సాధించారని, టీఎస్పీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నియామకాల ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నారని తెలిపారు. ‘ఎన్నో ఉద్యోగాలను పారదర్శకంగా ఇచ్చారు. ప్రతిభ ఉంటే సర్కారు కొలువు సాధించడం కష్టమేం కాదు. ఎలాంటి పైరవీలు చేయనక్కర్లేదు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి పైరవీలు జరగడం లేదు.. పకడ్బందీ నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పక్షపాతం లేకుండా నియామకాలు చేపడుతున్నారు.’ అని స్పష్టం చేస్తున్నారు. ఎవరో కొందరు చేసిన తప్పును వ్యవస్థకు ఆపాదించడం సరికాదని సూచిస్తున్నారు. దరఖాస్తులు మొదలు, పరీక్షల నిర్వహణ, మార్కులు, ఇంటర్వ్యూలు, ఎంపిక ఇలా ప్రతి ప్రక్రియను టీఎస్పీఎస్సీ పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం నిజాయితీగా నియామకాలు చేపట్టినందునే తాము తమ కలలను నెరవేర్చుకున్నామని చెబుతున్నారు.
గోవిందరావుపేట : మా పెద్ద కొడుకు అనిల్కుమార్ టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్ష రాసి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించాడు. మాకు కొద్దిపాటి వ్యవసాయ భూమి, ప్రభుత్వం ఇచ్చిన రేషన్ షాపు ఉంది. పెద్ద కొడుకు 2017లో పీజీ పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నప్పుడు తెలంగాణ సర్కార్ 2018 అక్టోబర్లో టీఎస్పీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. మా కొడుకు కూడా దరఖాస్తు చేసుకున్నడు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్లో రిజల్ట్లో గవర్నమెంట్ నౌకరీ సాధించాడు. 2019 నుంచి ములుగు మండలం బరిగలోనిపల్లిలో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించేందుకు కృషి చేస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం కార్యదర్శిగా చేస్తూనే గ్రూప్-2కు ప్రిపేర్ అవుతున్నాడు.
– దీకొండ కుమారస్వామి-కోమల దంపతులు, బుస్సాపురం, గోవిందరావుపేట మండలం
బచ్చన్నపేట, మార్చి 19 : మాది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ గ్రామం. ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించింది. 2017లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్అండ్బీ, ఇరిగేషన్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల్లో 463 ఖాళీ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. 2017 ఆగస్టు 27న పరీక్ష రాసిన. డిసెంబర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేశారు. 2018 జూన్ 7న ఉద్యోగంలో జాయిన్ అయిన. రాత పరీక్షలో 450 మార్కులకు 283 వచ్చాయి. ఇంటర్వ్యూలో 50 మార్కులకు 40 వచ్చినయ్. 19వ ర్యాంక్ సాధించా. ప్రస్తుతం జనగామ హెడ్క్వార్టర్ ఆర్అండ్బీలో ఏఈగా డ్యూటీ చేస్తున్న. పారదర్శకంగా, పకడ్బందీగా ఎంట్రెన్స్ పెట్టారు. ఎలాంటి అవకతవకలు జరుగలేదు. పైసా ఖర్చు లేకుండా, అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రతిభతో ఉద్యోగం సాధించా. కష్టపడి చదివించిన అమ్మానాన్నలు, కుటుంబ సభ్యుల సహకారంతో నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తున్నా.
– పొన్న శ్రీశైలం, ఆర్అండ్బీ ఏఈ, బచ్చన్నపేట
– నాగులగాని వినయ్వర్మ, ఏఈవో
కమలాపూర్ : మాది కమలాపూర్ మండలం కొత్తపల్లి. అమ్మనాన్న నాగులగాని వనిత, సాంబశివరావు. మాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. వ్యవసాయం చేసుకుంటూనే మా చెల్లె ప్రియాంక, నన్ను చదివించారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆదిత్య ఉన్నత పాఠశాలలో చదివాను. తొమ్మిది, పదో తరగతులు కమలాపూర్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో చదివా. 2010లో పదోతరగతి వార్షిక పరీక్షలో 514 మార్కులు వచ్చాయి. దీంతో మహబూబ్నగర్ జిల్లా పాలెంలో అగ్రికల్చర్ డిప్లమా సీటు వచ్చింది. డిప్లమా పూర్తి చేసి అగ్రిసెట్ రాయడంతో రాష్ట్రంలో 14వ ర్యాంకు వచ్చింది. దీంతో జగిత్యాల పొలాసలో బీఎస్సీ అగ్రికల్చర్లో సీటు వచ్చింది. జగిత్యాల పొలాసలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నప్పుడే 2016లో టీఎస్పీఎస్సీలో వ్యవసాయ విస్తరణాధికారుల నోటిఫికేషన్ వచ్చింది. దానికి దరఖాస్తు చేసుకుని అదే సంవత్సరం జూన్ 4న పరీక్ష రాశాను. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం పకడ్బందీగా పరీక్ష నిర్వహించింది. 17 జనవరి 2017లో ఫలితాలను ప్రకటించింది. అందులో ఉద్యోగానికి క్వాలిఫై అయ్యాను. అదే నెల 30న అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది. అప్పటినుంచి కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెంలో ఏఈవోగా పనిచేస్తున్నా. నేను ఊహించలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పైరవీ లేకుండా నా లాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తికి నిష్పక్షపాతంగా ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ఉద్యోగం రావాలంటే పైరవీలు చేసి మధ్యవర్తులకు డబ్బులు ఇవ్వాలనే ప్రచారం జరిగేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక ప్రతిభ ఉంటే ఎలాంటి కోచింగ్ తీసుకోకున్నా.. లంచాలు, పైరవీ లేకుండా ఉద్యోగం సాధించవచ్చని నా జీవితంలో రుజువైంది.
– గిత్త అపూర్వ, ఏఈవో, లింగాలఘనపురం
లింగాల ఘనపురం, మార్చి 19 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏఈవో పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. వెయ్యి ఎకరాలకు ఒక ఏఈవో పోస్టు చొప్పున నింపారు. ఖాళీ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. 2017లో వ్యవసాయ శాఖలో కొత్తగా ఏఈవో పోస్టులు దక్కాయి. మాది మహబూబాబాద్ జిల్లా. నేను అగ్రికల్చర్ డిప్లొమా చదివా. కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుని పరీక్ష రాసి జాబ్ సాధించా. పారదర్శకంగా ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ఉద్యోగాల నియామకం చేపట్టారు. అమ్మానాన్న ప్రోత్సాహంతో చదువుకున్నా. నేను రైతులకు పంటల సాగులో సూచనలిస్తూ సహకారం అందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏఈవోగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉంది.
నర్సింహులపేట : నాది నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామం. నా పేరు చందు వెంకన్న. మాది నిరుపేద కుటుంబం. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో 5 సార్లు పరీక్ష రాశా. త్రుటిలో తప్పింది. అయినా నిరాశ చెందకుండా గ్రూప్స్పై శ్రద్ధతో కోచింగ్ తీసుకున్నా. గ్రూప్-2 సాధించి ప్రస్తుతం ఎక్సైజ్ ఎస్సైగా ములుగు జిల్లా కేంద్రంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. కష్టపడి చదువుకున్నా. కొలువు కొట్టా. నాన్న అనారోగ్యంతో చనిపోయి కొంత ఇబ్బందులున్నా ధైర్యంగా పరీక్ష రాశాను. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూనే గ్రూప్-1కు ప్రిపేర్ అవుతున్నా.
– చందు వెంకన్న, జయపురం, నర్సింహులపేట మండలం
రాయపర్తి : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొలువు సాధించడం అంటే అంతా ఆషామాషీ కాదు. టీఎస్పీఎస్సీ ఉద్యోగ సాధన కోసం జరిగిన ప్రిపరేషన్తో అనేక పోటీ పరీక్షల్లో అత్యంత సులువుగా అర్హత సాధించాం. టీఎస్పీఎస్సీలో నౌకరీ కోసం మాత్రం మూడేండ్లపాటు తండ్లాడాల్సి వచ్చింది. ఎంటెక్ పూర్తి కాగానే 2015లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేసుకున్నా. కష్టపడి చదివి పరీక్షలకు హాజరయ్యాను. కానీ, ఆనాడు నేను సాధించిన మార్కులకు కనీసం ఇంటర్వ్యూ దశకు కూడా చేరుకునే అవకాశం లభించలేదు. అదే ప్రిపరేషన్ నాలెడ్జ్తో గేట్కు అటెండ్ అయి అందులో ఉత్తీర్ణుడయ్యాను. సరిగ్గా మూడేండ్లపాటు హైదరాబాద్లో రూమ్ కిరాయికి తీసుకుని చదివాను. రోజులో కనీసం నాలుగైదు గంటలు పుస్తకాలు పక్కన పెట్టేది. కష్టపడుతున్న క్రమంలో 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. నా పట్టుదలకు మరింత పదును పెట్టా. ఎంతో కష్టపడి 300 మార్కులకు సంబంధించిన కోర్ సబ్జెక్ట్ పరీక్ష, 150 మార్కులతో కూడిన జనరల్ సైన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించా. అప్పుడు టీఎస్పీఎస్సీ 1:2 రేషియోలో 5 మెన్ ప్యానెల్ బోర్డు చేసిన ఇంటర్వ్యూలో సైతం ప్రతిభాపాటవాలు ప్రదర్శించడంతో ఉద్యోగానికి ఎంపిక చేశారు. మూడేండ్లపాటు పుట్టి పెరిగిన ఊరు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులందరినీ పక్కనబెట్టి ప్రిపేర్ అయితేనే కొలువు సాధించగలిగాను.
– నాగుల రాజు, ఆర్అండ్బీ ఏడబ్ల్యూఈ, రాయపర్తి
– బుర్ర రంజిత్, ఎంపీవో, శాయంపేట
శాయంపేట : టీఎస్ పీఎస్సీలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రతిభ ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 2016లో గ్రూప్-2 నోటిఫికేషన్తో ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు. అప్పుడు నేను కూడా మండల పంచాయతీ అధికారి అయ్యాను. 2019 డిసెంబర్లో శాయంపేట మండలంలో జాయిన్ అయ్యా. టీఎస్పీఎస్సీలో పారదర్శకంగా నియామకం జరిగింది. అప్పట్లో ఇంటర్వ్యూ కూడా ఉంది. నాకు 600 మార్కులకు 521 వచ్చాయి. కోర్టు కేసుల వల్ల రెండేళ్ల తర్వాత నియామాకాలు జరిగాయి. అప్పుడు మొత్తం వెయ్యి పోస్టులిచ్చారు. ప్రతిభ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో పెట్టారు. 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. అవి పూర్తి చేసినంక సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్టు పెట్టారు. అభ్యర్థులు పెట్టిన డిపార్ట్మెంట్ ఏదుంటే ఆ శాఖకు ఫార్వార్డ్ చేశారు. నేను పంచాయతీరాజ్ ప్రియార్టీ పెట్టాను. అందులోనే సెలెక్ట్ అయ్యాను. తర్వాత లిస్టును పంచాయతీరాజ్ శాఖకు పంపించారు. ఆ శాఖ అధికారులు అక్కడ సర్టిఫికెట్లు అన్ని పరిశీలించి, పోస్టింగ్ ఆర్డర్ను ఇచ్చారు. మొదటి పోస్టింగ్ శాయంపేట మండలానికి ఎంపీవోగా ఇచ్చారు. టీఎస్పీఎస్సీలో నియామకాలపై ఎలాంటి అనుమానాలు లేవు. గ్రూప్స్ రాసి ఉద్యోగం సాధించడం నా కలగా ఉండేది. నాలుగైదు సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉండి ప్రిపేర్ అయ్యాను. ప్రత్యేక కోచింగ్ తీసుకున్నా. రోజు 12గంటలకుపైగా చదివా. ప్రిపరేషన్లో ఉండగానే గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చింది. రాత్రింబవళ్లు కష్టపడితేనే ఉద్యోగం సాధించగలిగా. బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి ఉద్యోగ సాధనే లక్ష్యంగా చదివాను. అనుకున్నది సాధించగలిగాను. ప్రస్తుతం నేను ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయ్యాను. ఎన్నో ఉద్యోగాలను టీఎస్పీఎస్సీలో పారదర్శకంగా ఇచ్చారు. కొంద రు చేసిన తప్పును వ్యవస్థకు ఆపాదించడం తగదు.
– కుంచారపు లక్ష్మా శ్రీకాంత్రెడ్డి, ఏఈవో
ఖానాపురం: టీఎస్పీఎఎస్సీ ద్వారా 2017లో ఏఈవోల నియామకాలు పారదర్శకంగా జరిగాయి. కష్టపడి చదువుకున్న వారికి మెరిట్ ప్రాతిపదికనే ఉద్యోగాలు వచ్చాయి. ఆన్లైన్లో పరీక్ష నిర్వహించారు. కేవలం 4 రోజుల్లోనే కీ ఆన్లైన్లో ఉంచారు. 15 రోజుల్లోనే ఆన్సర్ షీట్ వాళ్ల లాగిన్లో పెట్టారు. 3 ప్రశ్నలకు అందరికీ సమానంగా మార్కులు కలిపింది. మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ముందే తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాతిపదికన నియామకాలు జరిగాయి. ఇందులో 12 ఉద్యోగాలు జనరల్ విభాగానికి కేటాయించారు. జనరల్లో ఇద్దరం మాత్రమే ఎంపికయ్యాం. నాకు ఉమ్మడి వరంగల్లో 10వ ర్యాంకు వచ్చింది. ఐదు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పోస్టింగ్ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగింది. మెరిట్ ప్రాతిపదికన పిలిచి కావాల్సిన జిల్లాను ఎన్నుకునే విధంగా అవకాశం కల్పించారు. నేను నల్లబెల్లి మండలాన్ని ఎంపిక చేసుకున్నా. జిల్లాల కేటాయింపులో కలెక్టర్లు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. నోటిఫికేషన్ రాగానే ఇంట్లోనే ప్రిపరేషన్ మొదలు పెట్టాను. రోజుకు 8 గంటలు చదివాను. 22 ఏళ్ల వయసులోనే ఉద్యోగం సాధిస్తానని ఊహించలేదు. నోటిఫికేషన్ రావడం, నియామకాలు జరుగడం చకచకా జరిగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం నిజాయితీగా పరీక్షలు నిర్వహించడం వల్లే నేను ఉద్యోగం సాధించా. అందుకు ప్రభుత్వానికి కృతఙ్ఞతలు.
– జోరు శ్యామ్, జూనియర్ అసిస్టెంట్, చెన్నారావుపేట
నర్సంపేట, మార్చి 19: తెలంగాణ ప్రభుత్వం పైరవీలకు తావులేకుండా ప్రతిభకే పట్టం కడుతున్నది. నేను 2011లో బీటెక్ పూర్తి చేశాను. 2017కు ముందు పంచాయతీ కార్యదర్శిగా పని చేశా. వీఆర్వోగా కూడా ఏడాది కాలం పనిచేశాను. 2017లో ఫారెస్టు బీట్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికయ్యాను. ఈ పోస్టులోనూ ఏడాదిన్నరపాటు పనిచేశాను. మళ్లీ 2018లో గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టు సాధించాను. 2021 నుంచి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు గ్రూప్-2 కోసం ప్రిపేరవుతున్నా. తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన చేయడంతో ప్రిపేర్ అయ్యాను. ప్రతిభ ఉంటే సర్కారు కొలువు సాధించడం కష్టమేమీ కాదు. ఎలాంటి పైరవీలు చేయనక్కర్లేదు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలాంటి పైరవీలు జరుగడం లేదు. పక్షపాతం లేకుండా మార్కులు, ఇంటర్వ్యూలు, నియామకాలు చేపడుతున్నారు.
– ఆరెపల్లి సుమన్, నాయబ్ తాహసీల్దార్
భీమదేవరపల్లి, మార్చి 19 : మాది హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామం. నేను నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టినా మా అమ్మనాన్న ఆరెపల్లి కోమల, చేరాలు నన్ను, మా తమ్ముడిని చాలా కష్టపడి చదివించారు. మాకున్నది కేవలం ఒక ఎకరం మాత్రమే. మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకుని మా నాన్న వ్యవసాయం చేసేవాడు. మేము కాలేజీ లేని సమయాల్లో మా అమ్మనాన్నకు ఆసరయ్యేటోళ్లం. 2016లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. మూడు నెలల పాటు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో కోచింగ్ వెళ్లిన. అక్కడ హాస్టళ్ల్ల ఉండడమే గగనం. అసొంటిది లాంగ్ కోచింగ్ వెళ్లే ఆర్థిక స్థోమత లేదు. ఉన్న మూడు నెలలు కోచింగ్కు వెళ్లేందుకు డబ్బులు లేకుంటే ఎట్లయితే గట్లయితదని హాస్టళ్లనే ఉండి సదువుకున్న. టీఎస్పీఎస్సీలో గ్రూప్-2 ఎగ్జామ్ రాసిన. కానీ, ఫలితాలు వచ్చేందుకు లేటయింది. ఇంతలో నాకు పంచాయతీ కార్యదర్శి జాబ్ వచ్చింది. ఏడాది పాటు భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లిలో పంచాయతీ సెక్రటరీగా పనిచేసిన. ఇంతలో గ్రూప్-2 రిజల్ట్ వచ్చింది. నాకు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నాయబ్ తాసీల్దార్గా పోస్టింగ్ వచ్చింది. ఆ వార్త విన్నంక నా ఆనందానికి అవధుల్లేవు. ఆ కుర్సీల కూసున్నంక నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని ఎన్నో మార్లు దేవుడిని తలుసుకున్న. ప్రస్తుతం భీమారంలో పనిచేస్తున్నా. నా భార్య పేరు మమత, నాకు రెండున్నరేళ్ల పాప హన్సిత ఉంది. నా భార్య మమత ప్రస్తుతం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనగిరిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నది. ప్రభుత్వం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం, మేము పడిన కష్టం వల్లే కొలువు దక్కిందని నేను బలంగా నమ్ముతున్న.
జఫర్గఢ్ : మా స్వస్థలం హనుమకొండ పట్టణం. తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత మొదటి సారిగా టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. పకడ్బందీగా, అక్రమాలకు తావులేకుండా పరీక్షలు జరిగాయి. నేను కష్టపడి చదివి పట్టుదలతో రాశాను. ఎంపీవోగా పోస్టింగ్ వచ్చింది. 2015-16లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రాగానే గ్రూప్-2 పరీక్షలు రాశాను. 2019లో పంచాయతీరాజ్ శాఖలో మండల పంచాయతీ అధికారిగా నియామకమయ్యాను. నోటిఫికేషన్ నుంచి ఎంపీవోగా అపాయింట్మెంట్ వరకూ పారదర్శంగా పోస్టింగ్ ఇచ్చారు.
– చిదురాల సుమన్,ఎంపీవో జఫర్గఢ్
ఏటూరునాగారం: మాది వ్యవసాయ కుటుంబం. గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనే సంకల్పం ఉండేది. 2011లో బీఈడీ పూర్తి చేశాను. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. 2014లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఐప్లె చేశాను. ఎంపిక కాలేదు. నాలో పట్టుదల ఎక్కువైంది. 2018లో నోటిఫికేషన్ వచ్చింది. కష్టపడి చదివాను. నేను పోలీస్ కానిస్టేబుల్, పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సెలెక్ట్ అయ్యాను. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో 2019 ఏప్రిల్ 12న జాయిన్ అయ్యాను. నోటిఫికేషన్, రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు అంతా పకడ్బందీగా నిర్వహించారు. ఎంపిక ప్రక్రియ పారదర్శంగా జరిగింది. ఎలాంటి పైరవీలు జరగలేదు. ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టాను. శివ్వాపూర్లో కార్యదర్శిగా పనిచేస్తున్నా.
– హసీనాబేగం, పంచాయతీ కార్యదర్శి, శివ్వాపూర్, ఏటూరునాగారం మండలం