తెలంగాణపై అక్కసును వెళ్లగక్కి, ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్రమోదీపై జనాగ్రహం పెల్లుబికింది. మొదటినుంచీ రాష్ట్రంపై వివక్ష చూపడమే గాక ఇప్పుడు సాక్షాత్తూ చట్టసభల సాక్షిగా ఆత్మగౌరవంపై దాడిచేశారంటూ మండిపడింది. మోదీ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్యర్యంలో బుధవారం నిర్వహించిన ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అట్టుడికింది. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఉద్యమకారులు, ప్రజాసంఘాలు ఇందులో పాల్గొనగా, ప్రధాని మోదీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ సర్వత్రా వ్యక్తమైంది. జనగామ జిల్లా దేవరుప్పుల, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బైక్ ర్యాలీలో పాల్గొని మోదీపై నిప్పులు చెరిగారు. జనగామ జిల్లాకేంద్రంలో తీసిన భారీ బైక్ ర్యాలీలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాకేంద్రాల్లో నల్లజెండాలు చేత పట్టి, బైక్లపై పెద్ద ఎత్తున ర్యాలీలతో హోరెత్తించారు. మోదీకి శాపనార్థాలు పెడుతూ దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ నగర వీధుల్లో ఊరేగించారు. హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ నలుపు దుస్తులు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొనగా, వరంగల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శ్రేణులతో కలిసి మూడు వేల బైక్లతో అజంజాహి మిల్స్ నుంచి వెంకట్రామా థియేటర్ మీదుగా పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీ తీశారు. జయశంకర్ భూపాలపల్లిలో జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ములుగు జిల్లాకేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబాబాద్లో ఎమ్మెల్యే శంకర్నాయక్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి, మోదీ వైఖరి నశించాలంటూ నినదించారు. మరిపెడలో తలపెట్టిన ధర్నాలో డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ పాల్గొని మోదీ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
– నమస్తే నెట్వర్క్
అక్కడ పార్లమెంట్ సాక్షిగా ‘తెలంగాణ ఆత్మగౌరవం’పై ప్రధాని మోదీ విషం కక్కుతుంటే.. ఇక్కడేమో స్థానిక బీజేపీ మూకలు నల్లజెండాలతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ శ్రేణులపై దుశ్చర్యకు తెగబడ్డారు. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆయన దిష్టిబొమ్మ శవయాత్రలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి ముందువరుసలో ఉండి బైక్ ర్యాలీ తీస్తుండగా బీజేపీ కార్యకర్తలు దొంగ దాడిచేశారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కర్రలు, రాళ్లతో దాడి చేసి రక్తం కళ్లజూశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరుగగా, ము న్సిపల్ కోఆప్షన్ సభ్యుడు మసియొద్దీన్, పురుషోత్తం సహా ఐదుగురు కార్యకర్తల తలలకు గా యాలయ్యాయి. ఘటనకు కారణమైన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
– జనగామ, ఫిబ్రవరి9(నమస్తే తెలంగాణ)
వరంగల్ లీగల్, ఫిబ్రవరి 9: రాజ్యాంగాన్ని కించపరిచేలా.. తెలంగాణ ఏర్పాటును హేళన చేసేలా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నామని న్యాయవాదులు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్ ఆధ్వర్యంలో వరంగల్ లీగల్ సెల్ విభాగం న్యాయవాదులు అదాలత్ కోర్టు ప్రాంగణం ముందు బుధవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు జనార్దన్గౌడ్, శ్రీధర్రావు, వినోద్కుమార్, శ్రీధర్రెడ్డి, వెంకన్న, వసంత్, పుల్ల ప్రవీణ్కుమార్, జాన్ మహమ్మద్, సిద్దునాయక్, సంతోష్, శివకుమార్ పాల్గొన్నారు.
హనుమకొండ, ఫిబ్రవరి 9 : తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వాఖ్యలను ఖండిస్తున్నట్లు టీజీవోల సంఘం ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ ఏ జగన్మోహన్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. నాడు ఉద్యోగాలను పణంగా పెట్టి పోరాటాలు, సహాయ నిరాకరణ, సాగరహారం, మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె చేశామని, తెలంగాణ సాధనలో ప్రాణాలర్పించిన యువకుల త్యాగాలను చులకన చేసి పార్లమెంట్లో మోదీ మాట్లాడిన మాటలు తమకు ఎంతోబాధ కలిగించాయని వెల్లడించారు. దేశ ప్రధాని ఒక ప్రాంత ప్రజల పోరాటాన్ని కించపరిచినట్లు మాట్లాడడం సమంజసం కాదని, తెలంగాణలో మోదీ మాటలతో మరో ఉద్యమం వచ్చే అవకాశముందని, ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ప్రకటనలో కోరారు.