వరంగల్, ఫిబ్రవరి 9(నమస్తేతెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు ఇచ్చిన మేరకు బుధవారం జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. రాయపర్తిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి ఎర్రబె ల్లి దయాకర్రావు స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని హసన్పర్తిలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ బైక్ ర్యాలీలో పాల్గొని బస్టాండ్ వద్ద మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. భారీ నిరసన బైక్ ర్యాలీతో వరంగల్ తూర్పు హోరెత్తిపోయింది. తూర్పులోని అన్ని డివిజన్ల నుంచి స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేతృత్వంలో టీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ తీశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన ప్రధాని మోదీ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. నల్ల జెండాలు, కండువాలు, బ్యాడ్జీలు ధరించి వాడవాడనా ప్రధాని దిష్టిబొమ్మలతో శవయాత్రలు చేసి దహనం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా గులాబీ దండు చేసిన నినాదాలు మార్మోగాయి. ఊరువాడ దద్దరిల్లింది. నర్సంపేట పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రధాని దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి చౌరస్తా వద్ద దహనం చేశారు. నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, దుగ్గొండి మండల కేంద్రాల్లోనూ మోదీ దిష్టిబొమ్మలతో నిరసన ర్యాలీలు తీశారు. అనంతరం చౌరస్తాల వద్ద దహనం చేశారు. నల్లబెల్లిలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. వర్ధన్నపేట పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గీసుగొండ మండలంలోని గొర్రెకుంట క్రాస్రోడ్డు వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జడ్పీటీసీ పోలీసు ధర్మారావుతో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు. సంగెం, పర్వతగిరిలో బైక్ ర్యాలీ నిర్వహించి మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ జంక్షన్లో మూడో డివిజన్ కార్పొరేటర్ జన్ను షిబారాణి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు.